Bandi Sanjay Kumar: సైబర్ నేరాల్లో ముందు వరుసలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు

Bandi Sanjay Kumar on Rise in Cyber Crimes in India
షార్ట్స్‌లో చూడండి
దేశంలో సైబర్ నేరాలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. గడిచిన మూడేళ్లలో సైబర్ క్రైమ్ కేసులు ఏకంగా 60 శాతానికి పైగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021లో 52,974గా ఉన్న కేసుల సంఖ్య, 2023 నాటికి 86,420కి చేరినట్లు తెలిపింది. జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) సమాచారం మేరకు ఈ వివరాలను కేంద్ర హోంశాఖ బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

ఈ గణాంకాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఆర్థికపరమైన మోసాలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఆన్‌లైన్ ఫ్రాడ్ కేసులు 2021లో 14,007 ఉండగా, 2023 నాటికి 39 శాతం పెరుగుదలతో 19,466కి చేరాయి. ఇక చీటింగ్ సంబంధిత సైబర్ నేరాలైతే ఏకంగా 150 శాతానికి పైగా పెరిగి 6,343 నుంచి 16,943కి ఎగబాకాయి. కంప్యూటర్ సంబంధిత నేరాలు కూడా 77.4 శాతం పెరిగాయని తెలిపారు.

రాష్ట్రాల వారీగా చూస్తే, సైబర్ నేరాలకు కర్ణాటక హాట్‌స్పాట్‌గా నిలిచింది. 2023లో అక్కడ అత్యధికంగా 21,889 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 18,236 కేసులతో తెలంగాణ ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 10,794 కేసులు నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. కేరళలో సైబర్ కేసులు ఐదు రెట్లు పెరగడం గమనార్హం. అక్కడ 2021లో 626 కేసులు నమోదు కాగా, 2023లో 3,295కి చేరాయి. మహిళలు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ స్టాకింగ్, బెదిరింపులకు సంబంధించి గత ఏడాది 1,305 కేసులు నమోదైనట్లు తెలిపారు.

సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా బండి సంజయ్ వివరించారు. "సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్" ద్వారా 2021 నుంచి ఇప్పటివరకు రూ.7,130 కోట్లకు పైగా ప్రజల సొమ్మును కాపాడినట్లు చెప్పారు. సైబర్ నేరాలతో సంబంధం ఉన్న 11.14 లక్షల సిమ్ కార్డులు, 2.96 లక్షల ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
Bandi Sanjay Kumar
Cyber Crime
Cyber Fraud
Online Fraud
Karnataka
Telangana
NCRB
Cyber Security
Digital Crime
Financial Fraud

More Telugu News