చెక్ రాయడం కూడా రాని వ్యక్తి హెడ్మాస్టరా?
- హిమాచల్ ప్రదేశ్ లో ఓ హెడ్మాస్టర్ రాసిన చెక్కు ఫొటో వైరల్
- చెక్ మొత్తం అక్షర దోషాలే
- మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు చెల్లింపుల కోసం చెక్ రాసిచ్చిన హెచ్ఎం
- ఆయన రాసిన పదాలకు అర్థం తెలియక చెక్కును ఆపేసిన బ్యాంకు సిబ్బంది
స్కూలు హెడ్మాస్టర్ రాసిచ్చిన చెక్ లో అక్షర దోషాలు ఉండడం.. రాసిన ఐదారు పదాలలో ఒక్కటి తప్ప మిగతావన్నీ తప్పులుగా ఉండటంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘చెక్ కూడా సరిగ్గా రాయలేని ఈ వ్యక్తి ఓ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఎలా అయ్యాడు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మేధావులు ఉంటారనే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడంలేదని, ఆర్థికంగా భారమైనా సరే ప్రైవేటు పాఠశాలలకే పంపిస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.
అసలు ఏంజరిగిందంటే..
హిమాచల్ ప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలకు హెడ్మాస్టర్ గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ఇటీవల ఓ చెక్ రాసిచ్చాడు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు చెల్లించాల్సిన రూ.7,616 లకు చెక్ ఇచ్చాడు. ఈ మొత్తాన్ని అక్షరాల్లో రాయాల్సిన చోట సదరు హెచ్ఎం ‘‘సావెన్ థర్స్డే సిక్స్ హరేంద్ర సీక్స్ ఓన్లీ’’ అని రాశారు. ఈ తప్పుల కారణంగా బ్యాంకు అధికారులు ఆ చెక్కును తిరస్కరించారు. ఈ చెక్ ను గుర్తుతెలియని వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.