Kaleshwaram Project: కాళేశ్వరంపై రాష్ట్రం లేఖ.. హైదరాబాద్‌ విచ్చేసిన సీబీఐ డైరెక్టర్!

Kaleshwaram Project Telangana seeks CBI probe director visits Hyderabad
షార్ట్స్‌లో చూడండి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని రోజులకే సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్‌లో ఆకస్మికంగా పర్యటించడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం కాళేశ్వరం కేసు దర్యాప్తులో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

నిన్న నగరానికి చేరుకున్న ఆయన హైదరాబాద్ జోన్ సీబీఐ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్ష రెండు గంటలకు పైగా కొనసాగినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1న కేంద్రానికి అధికారికంగా లేఖ రాసింది. ఈ పరిణామం జరిగిన వెంటనే సీబీఐ డైరెక్టర్ స్వయంగా హైదరాబాద్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, ఈ పర్యటన ఉద్దేశంపై స్పష్టత కొరవడింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ సూద్ సమీక్షలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రభుత్వం నుంచి అందిన లేఖ, ప్రాథమిక ఆధారాలు, హైకోర్టు ఆదేశాలు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, కాళేశ్వరం వ్యవహారంలో సీబీఐ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Kaleshwaram Project
Praveen Sood
Telangana
KCR
Harish Rao
CBI Investigation
Hyderabad CBI
Corruption allegations
Justice PC Ghosh Commission
Telangana government

More Telugu News