బైక్ కోసం కన్నతండ్రిపై గొడ్డలితో దాడి.. ఖమ్మంలో దారుణం
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన తండ్రి
- కూలి పనులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తండ్రి..
- జులాయిగా తిరుగుతూ తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకు
- ఇటీవలే సెల్ ఫోన్ కోసం గొడవ.. అప్పు చేసి కొనిచ్చామంటున్న తల్లి
నాగయ్య కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చదువు మధ్యలోనే ఆపేసిన కొడుకు సతీష్ (22) జులాయిగా తిరుగుతున్నాడు. ఇటీవల తనకు సెల్ ఫోన్ కావాలని గొడవ చేయగా అప్పు చేసి కొనిచ్చామని నాగలక్ష్మి తెలిపారు. బైక్ కోసం రెండు నెలల గొడవ చేస్తుండగా.. బైక్ కొనేంత డబ్బు తమ వద్ద లేదని సర్దిచెప్పినా వినలేదన్నారు. ఏదైనా పనిచేసి బైక్ కొనుక్కోమని చెప్పగా తమపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడని వాపోయారు. ఈ నెల 13 వ తేదీలోగా బైక్ కొనవ్వకుంటే తామిద్దరినీ చంపేస్తానని కొడుకు బెదిరించాడని నాగలక్ష్మి మీడియాకు వివరించారు.
ఈ క్రమంలోనే 14వ తేదీ తెల్లవారుజామున తండ్రి నాగయ్యపై సతీశ్ గొడ్డలితో దాడి చేశాడని, అడ్డుకోవడానికి వెళ్లిన తనపైనా దాడికి ప్రయత్నించాడని చెప్పారు. దీంతో తాను భయంతో అరుస్తూ బయటకు పరుగులు తీసినట్లు తెలిపారు. తన కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చేసరికి కొడుకు పారిపోయాడని చెప్పారు. గొడ్డలి వేటుతో గాయపడ్డ తన భర్త నాగయ్యను ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నాగలక్ష్మి చెప్పారు.