పాశమైలారం పేలుడు ఘటన: ప్రభుత్వం కీలక నిర్ణయం
- సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడుపై ప్రభుత్వ విచారణ
- సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
- ప్రమాద కారణాలు, భద్రతా వైఫల్యాలపై దర్యాప్తునకు ఆదేశాలు
- నెల రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ
- భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలపై సూచనలు కోరిన ప్రభుత్వం
సీఎస్ఐఆర్కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త బి. వెంకటేశ్వరరావు ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా చీఫ్ సైంటిస్ట్ టి. ప్రతాప్కుమార్, విశ్రాంత శాస్త్రవేత్త సూర్యనారాయణ, పుణెకి చెందిన భద్రతాధికారి సంతోష్ ఘుగేను నియమించారు. ఈ కమిటీకి అవసరమైన పూర్తి సహకారాన్ని ఫ్యాక్టరీల డైరెక్టరేట్ అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలను గుర్తించడం, సిగాచి పరిశ్రమ యాజమాన్యం భద్రతా నియమాలను, నిబంధనలను పాటించిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించడం ఈ కమిటీ యొక్క ప్రధాన బాధ్యత. దీంతో పాటు భవిష్యత్తులో రసాయన పరిశ్రమల్లో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పటిష్ఠమైన చర్యలపై ప్రభుత్వానికి కీలక సూచనలు, సిఫార్సులు చేయాలని కమిటీని కోరింది.
మరోవైపు రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాదం జరిగిన పరిశ్రమను సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఘటనాస్థలంలో శిథిలాలను తొలగించే పనులను అధికారులు ప్రారంభించారు.