Benjamin Netanyahu: ఢిల్లీలో నెతన్యాహు 'వాంటెడ్' పోస్టర్లు: బెల్జియం ఎంబసీ సిబ్బంది అరెస్ట్!

Benjamin Netanyahu Wanted Posters Found at Belgium Embassy Delhi Staff Arrested
షార్ట్స్‌లో చూడండి
గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు తీవ్రమవుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును 'వాంటెడ్' అంటూ పేర్కొంటూ వెలసిన పోస్టర్లు, బెల్జియం దౌత్య కార్యాలయ ప్రాంగణంలో కనిపించడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు బాధ్యుడని భావిస్తున్న ఎంబసీ సిబ్బంది ఒకరిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది.

చాణక్యపురిలోని దౌత్యవేత్తల నివాస ప్రాంతంలోని బెల్జియం ఎంబసీ కాంపౌండ్‌లోని రెండు స్తంభాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోటోతో కూడిన 'వాంటెడ్' పోస్టర్లు దర్శనమిచ్చాయి. వారం రోజుల క్రితమే ఈ పోస్టర్లను అంటించినట్లు తెలుస్తుండగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దాదాపు 50 సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, పోస్టర్లు అంటించిన వ్యక్తిని గుర్తించారు. నిందితుడు ఒకరోజు తెల్లవారుజామున ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. విచారణలో ఆ వ్యక్తి బెల్జియం దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకడని తేలింది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ చర్యకు గల కారణాలు, వెనుక ఉన్న ఉద్దేశాలపై విచారణ చేస్తున్నారు.

ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు ఒక సమగ్ర నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అందజేశారు. దీనిపై భారత ప్రభుత్వం స్పందిస్తూ, ఈ వివాదాస్పద అంశాన్ని బెల్జియం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామని తెలిపింది. ఇదిలా ఉండగా, గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను బెల్జియం ప్రభుత్వం పలుమార్లు బహిరంగంగా వ్యతిరేకించింది.
Go Back to Shorts
Benjamin Netanyahu
Israel
Gaza
Belgium Embassy
Delhi Police
Wanted Posters

More Telugu News