ఉబెర్ కు నోటీసులు ఇచ్చారు... ఇక రాపిడో వంతు?
- ముందస్తు టిప్ వసూళ్లపై ఉబెర్కు కేంద్రం నోటీసులు
- వివరణ ఇచ్చేందుకు ఉబెర్కు 15 రోజుల గడువు
- ఇదే విధానం పాటిస్తే రాపిడోపైనా విచారణకు అవకాశం
రైడ్ త్వరగా పొందేందుకు వీలుగా ప్రయాణికులను ముందస్తుగా టిప్ చెల్లించమని ఉబెర్ ప్రోత్సహిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "వేగవంతమైన సేవ కోసం వినియోగదారులను బలవంతంగా లేదా నర్మగర్భంగా ముందస్తు టిప్ చెల్లించమని కోరడం అనైతికం, దోపిడీతో సమానం. ఇటువంటి చర్యలు అనుచిత వ్యాపార విధానాల కిందకు వస్తాయి," అని ఆయన పేర్కొన్నారు.
సేవ ప్రారంభం కాకముందే టిప్ అడగడం వినియోగదారుల హక్కులను కాలరాయడమేనని, ఇది వినియోగదారుల పరిరక్షణ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ రాపిడో కూడా వినియోగదారులను సేవకు ముందే టిప్ చెల్లించమని ప్రోత్సహిస్తున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే, ఆ సంస్థపైనా సీసీపీఏ ప్రాథమిక విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పరిణామం రైడ్ హెయిలింగ్ సేవల సంస్థల వ్యాపార విధానాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.