Dr. D. Nageshwar Reddy: ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నిఘా కోసం త్వరలో స్మార్ట్ టాయిలెట్లు: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

Smart Toilets for Real Time Health Monitoring Dr Nageshwar Reddy
షార్ట్స్‌లో చూడండి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ టాయిలెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని, ఇవి మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తం చేస్తాయని ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణులు, పద్మ విభూషణ్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇటీవల కర్నూలు పర్యటనకు విచ్చేసిన ఆయనను స్థానిక వైద్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ఆధునిక వైద్య విధానాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

గతంలో గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలే ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయని భావించేవారని, కానీ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యానికి "గట్ హెల్త్" (జీర్ణవ్యవస్థ ఆరోగ్యం) కీలకమని స్పష్టమైందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వివరించారు. మన శరీరంలోని మైక్రోబయోమ్.. బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వంటి సూక్ష్మజీవుల సమూహం. శరీర విధులను నియంత్రిస్తూ గట్ హెల్త్‌ను, తద్వారా పూర్తి శారీరక ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుందని తెలిపారు. ఈ సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిని, హానికారక బ్యాక్టీరియా పెరిగితే అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. గట్ హెల్త్ అనేది వైద్యశాస్త్రంలో ఒక సరికొత్త, కీలకమైన అంశంగా మారిందన్నారు.

శరీరంలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి రెండు మార్గాలున్నాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రోబయాటిక్స్ ద్వారా నేరుగా మంచి బ్యాక్టీరియాను అందించవచ్చని, పెరుగు, మజ్జిగ వంటివి ఇందుకు ఉదాహరణలని చెప్పారు. ఇక ప్రీబయాటిక్స్ అంటే మనం తీసుకునే ఆహారం ద్వారా మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, ఉల్లిపాయలు, అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు వంటివి ప్రీబయాటిక్స్‌గా పనిచేస్తాయని వివరించారు. రోజూ రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని సూచించారు.

గట్ హెల్త్‌కు, గుండె జబ్బులకు మధ్య సంబంధం ఉందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేసే ‘టీఎంఏఓ’ అనే రసాయనం శరీరంలో ఎక్కువైతే గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు రావొచ్చని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియాను నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గించుకోవచ్చన్నారు. అదేవిధంగా అల్జీమర్స్ వ్యాధి, మెదడు పనితీరు, తెలివితేటలు కూడా బ్యాక్టీరియాతో ముడిపడి ఉన్నాయని, బ్యాక్టీరియాలో మార్పుల ద్వారా వీటికి చికిత్స చేసే పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు.

త్వరలోనే ఏఐ సాంకేతికతతో పనిచేసే స్మార్ట్ టాయిలెట్లు అందుబాటులోకి వస్తాయని, ఇవి మన మల, మూత్రాలను విశ్లేషించి ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి సమాచారం అందిస్తాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. అలాగే, స్టూల్ క్యాప్సూల్స్ ద్వారా అనేక జబ్బులను నయం చేయవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతుల మలాన్ని సేకరించి, దాన్ని శుద్ధి చేసి, పొడి రూపంలోకి మార్చి క్యాప్సూల్స్‌లో అందిస్తారని, దీనివల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియాను ప్రవేశపెట్టవచ్చని వివరించారు.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్, నూడిల్స్ వంటివి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆహార పదార్థాల్లోని ప్రిజర్వేటివ్‌లు, కలరింగ్ ఏజెంట్ల వల్ల శరీరంలోని బ్యాక్టీరియా దెబ్బతింటోందని, ఇది కేవలం అధిక క్యాలరీల సమస్య కాదని స్పష్టం చేశారు. పాఠశాలల పరిసరాల్లో, క్యాంటీన్లలో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అమ్మకాలను నిషేధించాలని, తద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆయన సూచించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ ఆహారం ఆరోగ్యకరమైనదో, ఏది మంచి బ్యాక్టీరియాను పెంచుతుందో అనేదానిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గ్రీస్ వంటి దేశాల్లో పాటించే ‘మెడిటరేనియన్ డైట్’ చాలా ఆరోగ్యకరమైనదని, దీనిని భారతీయ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ‘ఇండో-మెడిటరేనియన్ డైట్’గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

చివరగా, మంచి ఆరోగ్యం కోసం స్థానికంగా, సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమమని ఆయన సలహా ఇచ్చారు. రసాయన ఎరువులు వాడిన పంటలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, పాశ్చాత్య ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి హానికరం అన్నారు. సరైన మోతాదులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, నూనెలు కలిగిన, మన ప్రాంతంలో పండిన సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
Go Back to Shorts
Dr. D. Nageshwar Reddy
Smart Toilets
Artificial Intelligence
AI in healthcare
Gut Health
Microbiome
Probiotics
Prebiotics
Mediterranean Diet
Healthy Diet

More Telugu News