రేవంత్ రెడ్డి గారూ, దొంగను దొంగలాగే చూస్తారు: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

Revanth Reddy Called a Thief by KTR Telangana Political Row
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. "ఎక్కడకి వెళ్లినా దొంగలా చూస్తున్నారని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి దొంగను దొంగలా కాకుండా ఎలా చూస్తారు? నోట్ల కట్టలతో దొరికిన దొంగను కచ్చితంగా దొంగ అనే అంటారు, దొంగలాగే చూస్తారు. ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక వెర్రి పార్టీ గుడ్డిగా నమ్మి ముఖ్యమంత్రిని చేసింది. కానీ దేశంలో మిగతా ఎవరూ నమ్మడం లేదు. మోసగాళ్లను, దొంగలను దొంగే అంటారు. చివరి రోజు వరకు నిన్ను అలాగే అంటారు. కాంగ్రెస్ పార్టీ దొంగ చేతికి తాళాలు ఇచ్చింది" అని తీవ్రంగా మండిపడ్డారు.

ముఖ్యమంత్రి మాటలు శాపంగా మారాయి

ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపంగా పరిణమించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ నేడు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు పీఆర్సీ, డీఏలు చెల్లించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల ముందు ప్రతినాయకులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారా అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అడిగిన ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి అనుచితంగా మాట్లాడారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు.

కానీ అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల త్యాగాలు, వారి పోరాటం గురించి రేవంత్ రెడ్డికి ఇసుమంతైనా అవగాహన లేదని దుయ్యబట్టారు. 'ఫ్రీ జోన్ హైదరాబాద్' అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీర్పు వస్తే, తెలంగాణ ఉద్యోగులు దానిని తీవ్రంగా వ్యతిరేకించారని, తెలంగాణ ఎన్జీవోలు అప్పట్లో గొప్ప ఉద్యమం నడిపారని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చురుగ్గా పాల్గొని రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత, దేశంలో మరెక్కడా లేని విధంగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగుల వేతనాలు ఎక్కువగా ఉండాలన్న సంకల్పంతో కేసీఆర్ 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని, ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేశారని తెలిపారు. ఉద్యోగులే ఉద్యమకారులై, పెన్ డౌన్ చేసి, సకల జనుల సమ్మెతో తెలంగాణ కోసం పోరాడారని, అలాంటి వారిని నేడు అవమానించడం తగదని హితవు పలికారు.

రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. "రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి, కానీ మేము ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి కేసీఆర్ వారిని గౌరవించారు" అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చెప్పిన హామీలనే అడుగుతున్నారని, అవేమీ గొంతెమ్మ కోరికలు కావని అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేసి, రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. 

అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్‌లో ఉన్న 3 డీఏలు తక్షణమే ఇస్తామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని, 317 జీవో రద్దు చేస్తామని, కొత్త పీఆర్సీ అమలు చేస్తామని చెప్పిన విషయాలను ఆయన ప్రస్తావించారు. ఈ హామీలను నెరవేర్చాలని కోరుతున్న ఉద్యోగులను ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Revanth Reddy
KTR
Telangana Politics
TRS
Congress
Government Employees
PRC
DA
Telangana Assembly Elections
Political Controversy

More Telugu News