ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం
- బెట్టింగ్ లపై ఉక్కుపాదం మోపుదామన్న చంద్రబాబు
- బెట్టింగ్ ల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దామని వ్యాఖ్య
- నేరాలను తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలని సూచన
తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుదామని ఆయన అన్నారు. బెట్టింగ్ లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దామని తెలిపారు. మనం తీసుకునే నిర్ణయాలు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టేలా ఉండాలని చెప్పారు.
రాష్ట్రంలో నేరాలు తగ్గినప్పటికీ... ఆర్థిక నేరాలు పెరిగాయని చంద్రబాబు చెప్పారు. గంజాయి సాగు కూడా తగ్గిందని తెలిపారు. నేరస్తులు చాలా తెలివిగా ఉంటారని... సాక్ష్యాలు దొరకకుండా మాయం చేస్తారని చెప్పారు. నేరస్తుల్లో కొందరు పారిపోతారని.... మరికొందరు నేరాన్ని పక్క వ్యక్తులపై తోసేస్తారని... వైఎస్ వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ అని అన్నారు. నేరాలను తగ్గించేందుకు పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మావోయిస్టుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని చెప్పారు.