Smart Phone Gift: స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రెండున్నర కోట్లు కొట్టేశారు.. కర్ణాటకలో కొత్త తరహా చీటింగ్

Bengaluru Techie Loses Two and Half Crore In Shocking Mobile SIM Swap Scam
  • లాటరీలో ఫోన్ గెల్చుకున్నారని ఫోన్ కాల్
  • అడ్రస్ అడిగి నిజంగానే ఫోన్ పంపిన దుండగులు
  • ఆ ఫోన్ లో సిమ్ కార్డ్ వేయగానే బ్యాంకు ఖాతాలోని సొమ్ము కాజేసిన వైనం
కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపించిన దుండగులు.. దాంట్లో సిమ్ వేయగానే స్కామ్ చేశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కొత్త సిమ్‌ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియర్ లో నిజంగానే సెల్ ఫోన్ పంపించారు.

కొత్త ఫోన్.. అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్ లోని సిమ్ తీసి కొత్త ఫోన్ లో వేసి వాడడం మొదలుపెట్టాడు. సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్ లు, ఓటీపీలు వచ్చినా కొత్త ఫోన్ కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు. అయితే, అప్పటికే ఆ ఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకున్న స్కామర్లు.. సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్ వర్డ్ లు మార్చేశారు. ఆపై అతడి ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల 80 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.
Smart Phone Gift
SIM Swap
Bengaluru
Cyber Cheating
2.8 crore

More Telugu News