Chandrababu: మోదీ గారూ... మనిద్దరి స్కూల్ ఒకటే: చంద్రబాబు

Chandrababu heaps praise on PM Modi in Visakha rally
షార్ట్స్‌లో చూడండి
విశాఖ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు అని వెల్లడించారు. ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ అని చంద్రబాబు పేర్కొన్నారు. తామిద్దరి ఆలోచనా తీరు ఒకటేనని వ్యాఖ్యానించారు. 

"మోదీజీ...మీరు అభివృద్ధికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము మిమ్మల్ని ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుంటాం. అమరావతి రాజధానికి మీరే శంకుస్థాపన చేశారు. మీ ఆశీస్సులతోనే రాజధానిని పూర్తి చేసుకుంటాం. దాన్ని మీరే ప్రారంభిస్తారు. మీరు ఒకసారి అమరావతి రావాలని కోరుతున్నాం. నదుల అనుసంధానికి కూడా మీరు ప్రాధాన్యం ఇస్తారు. పోలవరం ప్రాజెక్టును మీ నాయకత్వంలో పూర్తి చేస్తాం. మీ ఆశీస్సులతో నదుల అనుసంధానం ప్రారంభిస్తున్నాం... మీ ఆశీస్సులతోనే పూర్తి చేస్తాం. 

అత్యంత వెనకబడిన ప్రాంతమైన రామాయపట్నంలో బీపీసీఎల్ ప్రాజెక్టు వచ్చింది. రాష్ట్ర ప్రజల మీకు ధన్యవాదాలు చెబుతున్నారు. గూగుల్ కూడా ఏఐలో పెట్టుబడులు పెట్టేందుకు విశాఖపట్నం వస్తోంది. 

గూగుల్ ప్రతినిధులు నాతో సమావేశమైనప్పుడు భవిష్యత్తులో పన్నులు పెంచే అవకాశం ఉందా? అని ప్రస్తావించారు. ఇటీవల ప్రధానితో సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావించాను. ప్రభుత్వం తెచ్చిన పాలసీల్లో మార్పులు ఉండవు... మీరు ధైర్యంగా ముందుకెళ్లండని చెప్పారు. ఇంతకంటే విశాఖ ప్రజలకు ఏం కావాలి? 

మోదీజీ... మీ స్కూల్, నా స్కూల్ ఒక్కటే. రేపు చేయాల్సిన పని, నిన్ననే చేసి ఉంటే బాగుండేదని ఆలోచించే ప్రధాని ఉండటం మన రాష్ట్ర ప్రజల అదృష్టం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ఎన్డీయే విధానం. కొప్పర్తి, ఓర్వకల్లుకు ఇండస్ట్రియల్ పార్కులు వచ్చాయి. ఎన్నికల ముందు చెప్పిన విధంగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 

వికసిత్ భారత్ నరేంద్ర మోదీ కల. స్వర్ణాంధ్ర ప్రదేశ్ మన కల. ప్రధాని దేశాన్ని ప్రపంచంలో నిలబెడితే...2047 నాటికి ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉండాలి. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు సరైన సమయంలో మోదీ దేశానికి ప్రధాని అయ్యారు" అని సీఎం అన్నారు.  

ఇక విజయాలే తప్ప అపజయాలు ఉండవు

మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు నిరంతరం కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాన్ని చేరుకోలేం. నిరంతర పాలన ఇస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చేసి నిరూపించిన వ్యక్తి మోదీ. ఎన్డీయే బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ధృడంగా ఉంటే ఏపీ బలంగా ఉంటుంది. 

డబుల్ ఇంజన్ సర్కార్... డబుల్ డిజిట్ గ్రోత్. రెండు ప్రభుత్వాలు ఒక్కటిగా ఉంటే రెండంకెల వృద్ధి సాధ్యమై పేదరికం పోతుంది. కూటమి తరపున హామీ ఇస్తున్నా... పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం. ఇది మొదటి అడుగు... ఇక జయాలే తప్ప అపజయం ఉండదు" అని సీఎం చంద్రబాబు అన్నారు.  
Go Back to Shorts
Chandrababu
Narendra Modi
Visakhapatnam
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News