రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు... సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
- ప్రభుత్వ విజయాలను, సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించడమే లక్ష్యం
- గతంలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల తరహాలోనే ఈ నివేదికల రూపకల్పన
- రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఎలా నడిపించామో స్పష్టం చేయాలని సూచన
- అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం
సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే గత వైసీపీ ప్రభుత్వ పాలనపై ఏడు అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్, శాంతిభద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ వంటి అంశాలపై వాస్తవ పరిస్థితులను ఆ శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందు ఉంచారు.
ఇప్పుడు ఆ శ్వేతపత్రాలకు కొనసాగింపుగా ఈ 'ప్రోగ్రెస్ రిపోర్ట్స్' ఉండాలని సీఎం సూచించారు. వివిధ శాఖల్లో వచ్చిన మార్పులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా సంస్కరణలను సమగ్రంగా ఇందులో పొందుపరచాలన్నారు. ప్రభుత్వంపై వస్తున్న అసత్య ప్రచారాలను (ఫేక్ న్యూస్) తిప్పికొట్టేందుకు, వాస్తవాలను ప్రజల ముందు ఉంచి రాష్ట్రాన్ని ఎలా గాడిన పెట్టారో స్పష్టంగా తెలియజేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ నివేదికల ద్వారా రెండేళ్ల ప్రభుత్వ పనితీరును ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.