Chandrababu: 1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu chit chat with media on new year eve
షార్ట్స్‌లో చూడండి
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో సీఎంగా ఎలా పరిపాలించానో అందరికీ తెలుసని, మరోసారి 1995 నాటి సీఎంను చూస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

"1995లో సీఎంగా నా పనితీరు చూశారు. ఇక ముందుకు కూడా ఆనాటి సీఎంను చూస్తారు. సోషల్ మీడియాలో ఇదివరకు లాగా ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయి. 

సెకీ ఒప్పందం మాకు లడ్డూలా దొరికిన విషయం వాస్తవమే. అయినప్పటికీ చట్టం ప్రకారమే ముందుకు వెళతాం. రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. 

2004లో నన్ను ఎవరూ ఓడించలేదు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా. నేను చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం. ఈసారి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ... ప్రజలను నాతోపాటే తీసుకెళతాను. ఆరు నెలల్లో వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు రాలేదు. 

ఇచ్చిన హామీలైన సీపీఎస్ రద్దు, మద్య నిషేధం అమలు చేస్తామని అబద్ధాలు చెప్పాడు. అధికారంలోకి వచ్చాక... 'నాకు తెలియదు, ఇంత ఖర్చు అవుతుందని అనుకోలేదు' అంటూ మాట మార్చారు. ఎంతమంది ఉన్నా అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. మేము మాత్రం ఇచ్చిన సూపర్ 6 హామీలను కచ్చితంగా అమలు చేస్తాం.

మేం వచ్చాక ప్రజల్లో భరోసా కలిగింది

జగన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎంతో భరోసా కలిగింది. జగన్ అరాచక విధానాలతో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు. అమరావతి, పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను సమస్యల వలయంలోకి నెట్టివెళ్లాడు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లకుపైగా ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి నిధులు తేవడంతో పాటు సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించుకున్నాం. ఉన్మాదంతో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని కట్టడి చేస్తున్నాం. సమస్యల సుడిగుండంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించేందుకు ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకు వెళుతున్నాం. 

జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలు రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయి. వాటిని సరిచేసేందుకు ఈ ఆరు నెలల పాటు కసరత్తు చేశాం. గత ఐదేళ్ల పాలన నేరాలు ఘోరాలకు అడ్రస్‌గా మారింది. కూటమి ప్రభుత్వం రాగానే శాంతి భద్రతలను సక్రమంగా అమలు చేస్తూ నేరాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం, 

గత పాలనంతా విధ్వంసం...మేము రిపేర్లు చేస్తూ వెళుతున్నాం

మా ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే మేం పాలన సాగిస్తున్నాం. ధ్వంసమైన వ్యవస్థలను రిపేర్ చేసుకుంటూ వెళ్తూ ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణానికి జగన్ అనేక చిక్కుముడులు వేశాడు. వాటిని విడదీస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. 

పోలవరం ప్రాజెక్టుకు టెక్నికల్ కమిటీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రం నుంచి నిధులు రాబట్టి త్వరలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించి అనుకున్న సమయానికే పూర్తి చేస్తాం. నేను ఎప్పుడూ రాజకీయ కక్షలు తీర్చుకోను... తప్పు చేసిన వారిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందే..."’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu
Chit Chat
Media
NTR Bhavan
Mangalagiri
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News