SM Krishna: క‌ర్ణాట‌క మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ క‌న్నుమూత‌

Veteran Politician And Ex Karnataka Chief Minister SM Krishna Dies At 92
షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ (92) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బెంగ‌ళూరులోని స‌దాశివ‌న‌గ‌ర్‌లో ఉన్న‌ తన స్వగృహంలో మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 2:45 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. 

ఎస్‌ఎం కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. అలాగే 2009 నుంచి 2012 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా కూడా ప‌నిచేశారు. 

ఇక రాష్ట్ర రాజ‌ధాని బెంగళూరును టెక్ క్యాపిటల్‌గా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బెంగళూరును ప్రపంచ పటంలో నిలిపిన ఘనత ఆయ‌న‌దే. కాగా, ఎస్‌ఎం కృష్ణ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలోనే ఇటు ఉమ్మ‌డి ఏపీకి చంద్ర‌బాబు సీఎంగా ఉన్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు పోటీప‌డి మ‌రీ ఇరు రాష్ట్రాలను అభివృద్ధిప‌థంలో న‌డిపించారు. బెంగళూరును ఎస్‌ఎం కృష్ణ టెక్ క్యాపిటల్‌గా మారిస్తే, హైద‌రాబాద్‌ను చంద్ర‌బాబు టెక్ హబ్‌గా తీర్చిదిద్దారు.   

ఎస్‌ఎం కృష్ణ 1932 మే 1న మాండ్య జిల్లాలోని సోమనహళ్లిలో జన్మించారు. మొదటి నుంచీ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయ‌న‌ తన రాజకీయ జీవితం చివర్లో బీజేపీలో చేరారు. కాగా, 1962లో మద్దూరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కర్ణాటక అసెంబ్లీ సభ్యుడిగా మారడంతో ఆయ‌న రాజకీయ జీవితం ప్రారంభమైంది. 

ఎస్‌ఎం కృష్ణ మైసూరులోని మహారాజా కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ త‌ర్వాత‌ బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ పట్టా పొందారు. అనంత‌రం ఆయ‌న‌ డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయం, జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా వెళ్లడం జ‌రిగింది.
Go Back to Shorts
SM Krishna
Karnataka

More Telugu News