మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశారనేది అబద్ధం: తెలంగాణ డీజీపీ

Telangana DGP responds on Maoists encounter
  • నిన్న తెల్లవారుజామున ఏటూరు నాగారంలో ఎన్‌కౌంటర్
  • భోజనంలో మత్తు పదార్థాలు కలిపి ఆ తర్వాత ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు
  • పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపాకే ఎన్‌కౌంటర్ జరిగిందన్న డీజీపీ
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భోజనంలో మత్తు పదార్థాలు కలిపి ఆ తర్వాత మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశారనే ఆరోపణలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. మావోయిస్టులపై విష పదార్థాలు ప్రయోగించామని చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. మావోయిస్టులు స్పృహ కోల్పోయాక కాల్పులు జరిపారని చెప్పడం సరికాదన్నారు.

పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారని, దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపగా... ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారన్నారు. హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచనల మేరకు శవపరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్ కేసు దర్యాఫ్తు అధికారిగా వేరే జిల్లా డీఎస్పీని నియమించామన్నారు.

నిన్న తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా సహా ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్‌ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్‌ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు కూడా ఉన్నారు. మృతుల్లో ఆరుగురు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారే.
Go Back to Shorts
Maoists
TS DGP
Telangana

More Telugu News