AIRCEL: ఎయిర్ సెల్ అధినేత ఆనంద కృష్ణన్ కన్నుమూత

Aircel Ananda Krishnan passes away
  • మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జన్మించిన కృష్ణన్
  • మలేషియాలో సంపన్నుల్లో ఒకరిగా నిలిచిన కృష్ణన్
  • సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్న మలేషియా ప్రధాని
ప్రముఖ పారిశ్రామికవేత్త, టెలికాం సంస్థ ఎయిర్ సెల్ అధినేత ఆనంద కృష్ణన్ మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1938లో మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో కృష్ణన్ జన్మించారు. ఆయన పూర్వీకులకు భారత్ తో సంబంధం ఉంది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 

చదువు పూర్తయిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించారు. మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా కృష్ణన్ నిలిచారు. 

కృష్ణన్ కు ముగ్గురు సంతానం ఉన్నారు. కుమారుడు థాయిలాండ్ లో బౌద్ధ సన్యాసిగా మారాడు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు కృష్ణన్ వ్యాపారాల్లో పాలుపంచుకోలేదు.

కృష్ణన్ మృతిపై మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఎక్స్ వేదికగా స్పందిస్తూ... కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ ఎన్నో సేవలందించారని కొనియాడారు. చాలా దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. 

కృష్ణన్ గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ స్పాన్సర్లలో ఒకరిగా ఉన్నారు. 
AIRCEL
Ananda Krishnan

More Telugu News