Srisailam: కొనసాగుతున్న వరద ప్రవాహం... నిండుకుండలా శ్రీశైలం జలాశయం

Flood continue to Srisailam project
  • కృష్ణా నది పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద
  • 10 గేట్లను ఎత్తి నీటి విడుదల
  • ఇన్ ఫ్లో 3.42 లక్షల క్యూసెక్కులు... ఔట్ ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులు
ఎగువ కృష్ణా నది పరీవాహక ప్రాంతాల నుండి శ్రీశైలం రిజర్వాయర్ కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుండి వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యామ్ వద్ద పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

శ్రీశైలం ప్రాజెక్టుకు ఇవాళ ఇన్ ఫ్లో 3,42,026 క్యూసెక్కులు ఉండగా... స్పిల్ వే ద్వారా 3,17,940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.5 అడుగులుగా నమోదైంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్ధ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 212.91(98.66 శాతం) ఉంది. ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం చేరడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తొంది. 
 
మరో పక్క శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60 వేల క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 


More Telugu News

Srisailam
Flood
Project
Andhra Pradesh