బీజేపీదే పైచేయి అని అందరికీ తెలుసు: ప్రధాని మోదీ
- లోక్సభ ఎన్నికలు 2024లో గెలుపుపై ప్రధాని మోదీ విశ్వాసం
- బీజేపీ వైపే మొగ్గు ఉందని వ్యాఖ్య
- నూతన ప్రభుత్వ తొలి 100 రోజుల కార్యాచరణ రూపొందించాలని ఆదేశించానన్న ప్రధాని
‘‘ ఇలాంటి పెద్ద దేశంలో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో తెలుసా? వ్యక్తులు, వారి అనుభవం ఇలా అన్నింటినీ దేశం గమనిస్తుంది. పార్టీ వ్యక్తి చెప్పినా, ప్రకటించకపోయినా ఓటర్లు వారిని అంచనా వేస్తారు. మా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి 100 రోజులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలంటూ మంత్రులకు బాధ్యత అప్పగించాను.’’ అని మోదీ అన్నారు. కాగా ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అత్యధికంగా 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ 2014లో 71, 2019లో 62 స్థానాలను గెలుచుకుంది.
ఈసారి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా సమాజ్ వాదీ పార్టీ 63 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. రాహుల్ గాంధీ రాయ్బరేలి నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఏడు దశల లోక్సభ ఎన్నిక పోలింగ్లో 4 దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. మూడు దశలు మాత్రమే మిగిలివున్నాయి. జూన్ 1న తుది దశ ఓటింగ్ జరగనుండగా.. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.