వైసీపీకి పరాజ‌యం తప్పదు.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారు: నాగబాబు

Janasena Leader Naga Babu Criticizes YSRCP
  • ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో నెలకొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల‌పై నాగ‌బాబు స్పందన 
  • హింసకు పాల్పడ్డ వైసీపీనే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందన్న జ‌న‌సేన నేత‌
  • ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘానికి విజ్ఞ‌ప్తి
  • జూన్ 4న వచ్చే ప్రజాతీర్పుతో వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉందంటూ వ్యాఖ్య‌
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార‌ వైసీపీకి ప‌రాజ‌యం తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగబాబు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం పార్టీ అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలో ఓ లేఖ విడుద‌ల చేశారు. లేఖ‌లో ప్ర‌ధానంగా ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో నెలకొన్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితుల‌ను నాగ‌బాబు ప్ర‌స్తావించారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగే దొంగ అని అరిచినట్టుగా వైసీపీ నేతల తీరు ఉందని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు.

పోలింగ్ అనంతరం ఏపీలో నెలకొన్న హింసపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నిక‌ల త‌ర్వాత కూడా వైసీపీ శ్రేణులు దాడుల‌కు పాల్ప‌డ‌డం విచార‌క‌రం అన్నారు. దీని అర్థం వైసీపీ డీఎన్ఏలోనే హింస ఉంద‌న్నారు. పులివ‌ర్తి నానిపై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌టం వైసీపీ హింస‌కు పరాకాష్ఠ అని నాగ‌బాబు మండిప‌డ్డారు. ఇలా ప‌లువురు నేత‌ల‌పై దాడుల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఇక‌ జూన్ 4న ఎన్నికల ఫలితాలతో వచ్చే ప్రజాతీర్పుతో వైసీపీ మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఆ రోజున పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాల‌ని తెలిపారు. రాష్ట్రంలో ఓటర్లు విజ్ఞతతో ఓట్లు వేశారని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనమని నాగబాబు చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Naga Babu
Janasena
YSRCP
AP Politics
Andhra Pradesh

More Telugu News