లగేజి పాలసీ మార్చిన ఎయిరిండియా... ఉచితంగా ఎంత లగేజి తీసుకెళ్లొచ్చంటే...!

Air India changes its luggage policy for economy class
  • ఇప్పటివరకు ఎకానమీ క్లాస్ లోని రెండు కేటగిరీల్లో 20 కేజీల ఫ్రీ లగేజి విధానం
  • ఇప్పుడా పరిమితిని 15 కేజీలకు తగ్గించిన ఎయిరిండియా
  • మే 2వ తేదీ నుంచి అమలు
కొన్నాళ్ల కిందటివరకు ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రస్తుతం టాటా గ్రూప్ అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. టాటాల చేతుల్లోకి వచ్చాక ఎయిరిండియా విధానాల్లో అనేక మార్పులు తీసుకువచ్చారు. తాజాగా సంస్థ లగేజీ పాలసీని కూడా మార్చారు. 

దేశీయ విమాన ప్రయాణాల్లో ఉచిత లగేజీపై గరిష్ఠ పరిమితిని ఎయిరిండియా తగ్గించింది. ఎకానమీ క్లాస్ లో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్ కేటగిరీల్లో ప్రయాణించే వారు ఇకపై ఉచితంగా 15 కేజీలు మాత్రమే లగేజీ తీసుకెళ్లే వీలుంటుంది. ఎకానమీ క్లాస్ లోని ఈ రెండు కేటగిరీల్లో ఇప్పటిదాకా ఈ పరిమితి 20 కేజీల వరకు ఉండేది. 

ఎయిరిండియా ప్రభుత్వ సంస్థగా ఉన్న సమయంలో ఉచిత లగేజీ పరిమితి 25 కేజీలు ఉండేది. ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేశాక ఈ పరిమితిని 20 కేజీలకు కుదించింది. తాజాగా, మరో ఐదు కేజీలు తగ్గిస్తూ, 15 కేజీలు మాత్రమే ఉచితంగా అనుమతిస్తామని ఎయిరిండియా తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నిబంధన మే 2 నుంచి అమల్లోకి వచ్చింది. 

అయితే ఎకానమీ క్లాస్ లోని ఫ్లెక్స్ కేటగిరీలో ప్రయాణించేవారికి మాత్రం 25 కేజీల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.

డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం ఏ ఎయిర్ లైన్స్ సంస్థ అయినా కనీసం 15 కేజీల లగేజీని ఉచితంగా అనుమతించాల్సి ఉంటుంది. అయితే, ఇతర ఎయిర్ లైన్స్ సంస్థలు ఈ 15 కేజీలను సింగిల్ బ్యాగేజి రూపంలో అనుమతిస్తుండగా, ఎయిర్ లైన్స్ మాత్రం నిర్దేశిత బరువుకు లోబడి ఎన్ని బ్యాగేజిలైనా తీసుకెళ్లేందుకు అనుమతిస్తోంది.
Go Back to Shorts
Air India
Luggage
Free
Tata Group
India

More Telugu News