నాపై కేసులు పెట్టడానికి తెలంగాణలో పోలీసులు లేరా?: అమిత్ షా పేక్ వీడియోపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
- బలహీనవర్గాలకు అండగా ఉండేది ఇండియా కూటమి మాత్రమేనని వ్యాఖ్య
- ఇది నాపై దాడి మాత్రమే కాదు... తెలంగాణపై, బడుగు బలహీన వర్గాలపై దాడిగా పేర్కొన్న సీఎం
- ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అని ఎద్దేవా
ఇది నాపై దాడి మాత్రమే కాదు....
రాజ్యాంగాన్ని మార్చాలా? వద్దా? అనేదే ఈ ఎన్నికల్లో చర్చనీయాంశమన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని... రిజర్వేషన్లు తొలగించాలనేది బీజేపీ నిర్ణయమని ఆరోపించారు. తనకు నోటీసులు ఇవ్వడం అంటే తనపై దాడిగా భావించడం లేదన్నారు. ఇది తెలంగాణపై, దళితులు, గిరిజనులపై దాడి అన్నారు. ప్రశ్నిస్తే లోపల వేస్తానని అమిత్ షా అంటున్నారని... ఇలాంటి సమయంలో మీరు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.
రిజర్వేషన్లపై ఏం మాట్లాడాలో... ఏం చెప్పాలో కిషన్ రెడ్డికి అర్థం కావడం లేదన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ నాడు దేశాన్ని ఆక్రమించినట్లు, ఇప్పుడు అంబానీ, అదానీలు బయలుదేరారని ఆరోపించారు. వారిద్దరికి మోదీ అండగా నిలిచారన్నారు. కేంద్రంలో 30 లక్షల ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం నవరత్న కంపెనీలను అమ్మేసిందని... దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అని ఎద్దేవా చేశారు. ఆయన సీఎం అయ్యాక తన సామాజికవర్గాన్ని బీసీలలో కలిపారన్నారు. అందుకే ఆయనకు బీసీలపై ప్రేమ లేదన్నారు.