కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫైల్ ను రేవంత్ తొక్కిపెట్టడానికి కారణం ఇదే: లక్ష్మణ్

Lakshman fires on Revanth Reddy
  • కేసీఆర్ తో రేవంత్ రాజీ పడ్డారన్న లక్ష్మణ్
  • ఓటుకు నోటు కేసు కూడా ముందుకు సాగదని వ్యాఖ్య
  • రేవంత్, రాహుల్ అబద్ధాలనే నమ్ముకున్నారని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని... అందుకే కాళేశ్వరం ఫైల్ ను తొక్కిపెట్టారని విమర్శించారు. రిజర్వేషన్లు కొనసాగాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టంగా చెప్పారని... ఇప్పుడు రేవంత్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తూ తెలంగాణ పరువు తీశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కొత్త కావచ్చని... కానీ, రాజ్యాంగాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని చెప్పారు. రాజ్యాంగాన్ని ఇందిరాగాంధీ అవమానించినంతగా ఎవరూ అవమానించలేదని అన్నారు. 

మతపరమైన రిజర్వేషన్లకు తావు లేదని అంబేద్కర్ చెప్పారని... కానీ దానికి కాంగ్రెస్ తూట్లు పొడిచిందని లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు అబద్ధాలనే నమ్ముకున్నారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీసీలకు 50 డివిజన్ లను కేటాయిస్తే... వాటిలో 31 మంది ముస్లింలు గెలిచారని... బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పారు. కేసీఆర్ తో రేవంత్ రాజీ పడ్డారని... అందుకే కాళేశ్వరం ఫైల్ ముందుకు సాగడం లేదని... ఓటుకు నోటు కేసు కూడా ముందుకు పోదని అన్నారు. ఒక్క మాదిగకు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని... కాంగ్రెస్ లో సామాజిక న్యాయం లేదని విమర్శించారు.
Go Back to Shorts
Lakshman
BJP
Revanth Reddy
Rahul Gandhi
Congress

More Telugu News