అవినీతిపరులను వదిలేది లేదు... వారికి జైలు లేదా బెయిల్ రెండే ఆప్షన్స్: ప్రధాని మోదీ

PM Modi to Bengal BJP workers
  • బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ హింసను ఎంచుకుందని... దీనిని యావత్ దేశం చూస్తోందన్న మోదీ
  • అవినీతిపరులంతా ఏకమై కూటమిగా ఏర్పడ్డారని విమర్శలు
  • ఎన్ని బెదిరింపులు వచ్చినా బెంగాల్ బీజేపీ కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారని ప్రశంస
అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి తాను కట్టుబడి ఉన్నానని, అవినీతికి పాల్పడే వారికి జైలు లేదా బెయిల్ అనే రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బుధవారం నమో యాప్ ద్వారా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌గా మాట్లాడుతూ... బెంగాల్లో బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ హింసను ఎంచుకుందని... దీనిని యావత్ దేశం చూస్తోందన్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు నిర్భయంగా వారిని శాంతియుతంగా ఎదుర్కొంటున్నారని ప్రశంసించారు.

అవినీతిపరులంతా ఏకమై కూటమిగా ఏర్పడ్డారని ఆరోపించారు. వారు నిత్యం మోదీని దూషిస్తూనే ఉంటారని విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ అవినీతిపై చర్యలు తీసుకోవడం ఆగదని హెచ్చరించారు. అవినీతిపరులకు జైలు లేదా బెయిల్ అనే రెండు ఆప్షన్లు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు.

బెంగాల్‌లో ఎన్నికల సమయంలో హింస అతిపెద్ద సవాల్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ప్రజల భద్రత కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. బెంగాల్‌లో మనం ప్రతి ఓటరు ఇంటికి చేరుకొని...  వారు నిర్భయంగా ఓటు వేసేలా చూడాలన్నారు. ప్రతి ఎన్నికల్లో హింస ద్వారా బీజేపీని ఆపేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా బెంగాల్ బీజేపీ కార్యకర్తలు ఎలా శాంతియుతంగా ముందుకు వెళ్తున్నారో యావత్ దేశం గమనిస్తోందన్నారు. ఈసారి ఎక్కువ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమన్నారు.
Go Back to Shorts
Narendra Modi
BJP
West Bengal
Lok Sabha Polls

More Telugu News