ప్రధాని మోదీ పాలనపై కేరళ సభలో నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- కేరళ సమరాగ్ని సభలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి
- కేరళ నుంచి 20 మంది ఎంపీలను లోక్ సభకు పంపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- బీజేపీని ముఖాముఖి ఎదుర్కొనే కాంగ్రెస్ను బలహీనపరిచేందుకు కేసీఆర్, పినరయి వంటి వారు థర్డ్ ప్రంట్ పేరుతో వచ్చారని ఆగ్రహం
కేరళలో నిర్వహించిన సమరాగ్ని సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మణిపూర్ ఘటన దేశానికి ఒక హెచ్చరిక లాంటిదన్నారు. మనం నిర్లక్ష్యం చేస్తే ఫలితం మన ఊహకే అందదని హెచ్చరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా ఫ్రంట్ విజయం దేశ భవిష్యత్తుకు అవశ్యమని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ దుష్పరిపాలనను అంతమొందించేందుకు కేరళ నుంచి 20 మంది యూడీఎఫ్ ఎంపీలను లోక్ సభకు పంపించాలని కేరళీయులను కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా ముఖాముఖి పోరాడుతోన్న ఇండియా ఫ్రంట్ను నిర్వీర్యం చేసేందుకు థర్డ్ ఫ్రంట్ పేరుతో అవినీతి నేతలు కేసీఆర్, పినరయి విజయన్ వంటి వారు తెరపైకి వస్తున్నారని, ఈ కుట్రను ప్రజలు గుర్తించాలన్నారు.
కేంద్రంలో బీజేపీ, కేరళలో సీపీఎం పాలనకు వ్యతిరేకంగా కేరళ పీసీసీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమం చేపట్టింది. ఈ రోజు తిరువనంతపురంలో సమరాగ్ని పేరుతో ముగింపు సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్, కేపీసీసీ ప్రెసిడెంట్ సుధాకరన్ తదితరులు పాల్గొన్నారు.