MIM Leader Shot Dead: బీహార్‌లో దారుణం.. ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సలామ్ కాల్చివేత

MIM Leader Abdul Salam Shot Dead In Bihars Gopalganj
  • గోపాల్‌గంజ్‌లో గత రాత్రి సలామ్‌పై కాల్పులు
  • బీహార్ సీఎం నితీశ్‌పై అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు
  • తమ నాయకుల కుటుంబాలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్న
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో గతరాత్రి దారుణం జరిగింది. ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లామ్ ముఖియా కాల్చివేతకు గురయ్యారు. విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. 

గత నెలలో సివాన్ జిల్లా అధ్యక్షుడు అరీఫ్ జమాల్‌ను కూడా కాల్చి చంపారని అసద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. ‘‘కుర్చీ కోసం జరిగిన పోటీలో మీరు మీ కుర్చీని కాపాడుకున్నారుగా, ఇప్పటికైనా కొంత పనిచేయండి. మా నాయకులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుందా?" అని ఒవైసీ ప్రశ్నించారు.

కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
MIM Leader Shot Dead
MIM
Abdul Salam
Asaduddin Owaisi

More Telugu News