'సలార్' తరువాత శ్రియా రెడ్డికి పెరుగుతున్న డిమాండ్!

Shriya Reddy Special
  • 'పొగరు'లో విలన్ గా ఆకట్టుకున్న శ్రియా రెడ్డి 
  • 'సలార్'తో మరోసారి మెప్పించిన నటి 
  • ప్రస్తుతం 'OG' సినిమాతో బిజీ 
  • 'సలార్' తరువాత పెరుగుతున్న ఆఫర్లు

శ్రియా రెడ్డి .. 'సలార్' సినిమాలో వినిపించిన పేరు .. కనిపించిన పేరు. ఆ సినిమాలో ఆమె రాజ మన్నార్ (జగపతిబాబు) మొదటి భార్య కూతురు రాధ రాజమన్నార్ గా కనిపించింది. బ్లాక్ శారీ కట్టుకుని .. 'సలార్' పై పగ తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. 'సలార్' పట్ల కసితో .. ద్వేషంతో రగిలిపోతూ, తమ ఇలాకాలోకి ఎప్పుడు ఎంటరవుతాడా అని చూస్తుంటుంది. తెరపై ఆమె కాంబినేషన్లోని సీన్స్ నడుస్తున్నప్పుడు ఆడియన్స్ వైపు నుంచి గ్రాఫ్ పెరుగుతుంది. అందుకు కారణం ఆమె నటన .. ఆమె పలికించిన హావభావాలు. శ్రియా రెడ్డి మంచి నటి .. ఒక పాత్రలో ఆమె ఎంత గొప్పగా ఒదిగిపోతుందనే విషయం, 'తిమిరు' (పొగరు) సినిమాతోనే అర్థమైపోయింది. ఆ సినిమాలో పెళ్లి కూతురు గెటప్ లో .. వర్షంలో ఆమె కత్తి పట్టుకుని పరుగెత్తుకు వచ్చే సీన్ ను ఆడియన్స్ ఇంకా మరిచిపోలేదు.

'పొగరు' సినిమా తరువాత మళ్లీ ఆమె 'సలార్'లోనే అంతటి పవర్ఫుల్ పాత్రలో కనిపించింది. ఈ సినిమా తరువాత శ్రీయారెడ్డికి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయట. వాటిలో చాలా వరకూ ఆమె బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలే కావడం విశేషం. తెలుగులో 'OG' సినిమాతో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తున్న తరహా పాత్రలలో, ఇకపై శ్రీయా రెడ్డి కూడా కనిపించే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Advertisement
Shriya Reddy
Actress
Pogaru
Salaar Movie

More Telugu News