ఈ ఏడాది 1132 మందికి గ్యాలంట్రీ అవార్డులు

Central Governament Announced gallantry awards
  • తెలంగాణకు 20, ఏపీకి 9 పతకాలు
  • 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
  • జమ్మూ కశ్మీర్ లో 133 మంది పోలీసులకు మెడల్స్
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది 1132 మంది ఉద్యోగులకు కేంద్ర హోంశాఖ గ్యాలంట్రీ అవార్డులు ప్రకటించింది. ఈమేరకు గురువారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. పోలీస్, హోంగార్డ్, ఫైర్, సివిల్ డిఫెన్స్ శాఖలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈ మెడల్స్ ప్రకటించింది. అవార్డులు అందుకోనున్న వారిలో జమ్మూ కశ్మీర్ పోలీసులే అత్యధికం.. 72 మంది పోలీసులను ఈ అవార్డు వరించింది. మొత్తంగా 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, 753 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు ప్రకటించింది.

గ్యాలంట్రీ అవార్డుల జాబితాలో తెలంగాణకు చెందిన 20 మంది ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన తొమ్మిది మందికి చోటు దక్కింది. తెలంగాణ అడిషనల్ డీజీపీలు సౌమ్య మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్ లను రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు వరించాయి. ఆరుగురు అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, పన్నెండు మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలు దక్కాయి. ఏపీలో తొమ్మిది మంది అధికారులను పోలీస్ విశిష్ట సేవా పతకాలు వరించాయి. కాగా, రాష్ట్రాలవారీగా చూస్తే జమ్మూ కశ్మీర్ అధికారులకు మొత్తంగా 133 మెడల్స్ దక్కగా, ఛత్తీస్ గఢ్ (26), ఝార్ఖండ్ (23), మహారాష్ట్ర (18) మంది అధికారులు అవార్డులు అందుకోనున్నారు. సీఆర్పీఎఫ్ నుంచి 65 మందికి, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మందికి, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న 119 మంది సిబ్బందికి ఈ మెడల్స్ దక్కాయి.
Go Back to Shorts
gallantry awards
Police medals
president medal
Republic Day

More Telugu News