Advertisement

విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు.. బ్యారికేడ్లు తోసుకుని వచ్చిన అభిమానులు

Chandrababu came to CID office
  • ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
  • మూడు కార్యాలయాల్లో పూచీకత్తులు సమర్పిస్తున్న బాబు
  • తొలుత విజయవాడ సీఐడీ కార్యాలయంలో ఇసుక కేసులో పూచీకత్తు సమర్పణ
టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపటి క్రితం విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఉచిత ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన సీఐడీ కార్యాలయంలో ఉచిత ఇసుక కేసులో పూచీకత్తును సమర్పించారు. దర్యాప్తు అధికారులకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు. 

చంద్రబాబు రాక సందర్భంగా సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే అక్కడకు భారీగా చేరుకున్న టీడీపీ అభిమానులు బ్యారికేడ్లను తోసుకుని ముందుకు వచ్చారు. చంద్రబాబుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని నినాదాలు చేశారు. 

మరోవైపు, ఐఆర్ఆర్ కేసులో కుంచనపల్లి కార్యాలయంలో పూచీకత్తును సమర్పించేందుకు ఇక్కడి నుంచి చంద్రబాబు బయల్దేరారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లి మద్యం కేసులో పూచీకత్తును సమర్పిస్తారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Advertisement
Chandrababu
Telugudesam
CID Office

More Telugu News