వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం: షర్మిల

Sharmila announces they merged YSRTP into Congress Party
  • కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల
  • పార్టీ కండువా కప్పిన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
  • నా తండ్రి కొనసాగిన పార్టీలోకి వచ్చానంటూ షర్మిల భావోద్వేగం  
  • రాహుల్ ను ప్రధాని చేయాలన్న వైఎస్ కల కోసం శ్రమిస్తానని వెల్లడి
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం గొప్ప సంతోషాన్నిస్తోందని తెలిపారు. 

"నా తండ్రి ఏ పార్టీకి చెందినవారో, నా తండ్రి ఏ పార్టీలో కొనసాగారో, నా తండ్రి ఏ పార్టీ కోసం అవిశ్రాంతంగా శ్రమించారో, నా తండ్రి ఏ పార్టీ కోసం తుదిశ్వాస వరకు పరితపించారో... ఇప్పుడు ఆ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేశాం. ఆయనకు ఈ పరిణామం అమితానందం కలుగజేస్తుందనడంలో సందేహంలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నా సొంతగూటికి తిరిగొచ్చిన ఆనందం కలుగుతోంది. 

దేశంలోనే అతిపెద్ద లౌకికవాద పార్టీ కాంగ్రెస్. భారతదేశ బహుళత్వాన్ని, నిజమైన సంస్కృతిని నిలబెట్టే పార్టీ కాంగ్రెస్. దేశాన్ని పునాదుల నుంచి నిర్మించి, అన్ని వర్గాల వారికి అచంచల సేవలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చాను. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది మా నాన్న కల. ఈ కలను సాకారం చేసేందుకు నా వంతు కృషి చేస్తాను. 

వైఎస్సార్ కుమార్తెగా దేశ ప్రజల కోసం కాంగ్రెస్ సైనికురాలిగా పనిచేస్తాను. విచ్ఛిన్నకర శక్తులు విజృంభిస్తున్న ప్రస్తుత క్లిష్ట సమయంలో రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడంలో, ఐక్యతను, సోదరతత్వాన్ని కాపాడడంలో చిత్తశుద్ధితో పనిచేస్తాను. 

ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం, దేశ ప్రజల కోసం నా సర్వశక్తులు ధారపోస్తాను" అంటూ షర్మిల ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు.
Go Back to Shorts
YS Sharmila
Congress
YSRTP
Andhra Pradesh
Telangana

More Telugu News