65 మంది అభ్యర్థులతో నేడు బీజేపీ తొలి జాబితా

Telangana BJP To Release First List Today
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో బిజీ
  • ఇంకా అభ్యర్థుల కూర్పుపైనే బీజేపీ తలమునకలు
  • నేటి సాయంత్రం తొలి జాబితా ప్రకటన
  • నిన్న జేపీ నడ్డా ఇంట్లో పలుమార్లు సమావేశమైన కోర్ కమిటీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నేతలు సభలు, సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లి బిజీబిజీగా ఉంటే బీజేపీ మాత్రం ఇప్పటికీ అభ్యర్థుల జాబితా తయారీలోనే తలమునకలై ఉంది. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, నేడు 65 మందితో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాశ్ జవదేకర్ నివాసంలో నిన్న జరిగిన రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులు పలుమార్లు చర్చించి జాబితాను సిద్ధం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్‌తోపాటు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ చీఫ్ నడ్డా నివాసంలో గతరాత్రి జరిగిన సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు నడ్డాతో మరోమారు సమావేశమైన తర్వాత తుది జాబితాను సిద్ధం చేసి సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపిస్తారు. ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా పాల్గొనే ఆ సమావేశంలో తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తారు.
Advertisement
Telangana Assembly Election
BJP
Congress
BRS

More Telugu News