Team India: శుభారంభం అందిస్తారనుకుంటే తుస్సుమన్నారు!

  • ఆసక్తికరంగా డబ్ల్యూటీసీ ఫైనల్
  • తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 469 ఆలౌట్
  • అనంతరం 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్
  • స్వల్పస్కోరుకే అవుటైన రోహిత్ శర్మ, గిల్
Team India openers fails to give good start

డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియాను కట్టడి చేశామన్న ఆనందం టీమిండియాకు ఎంతోసేపు మిగల్లేదు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ కాగా... అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.  

కీలక సమరంలో శుభారంభం అందిస్తారనుకున్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ స్వల్పస్కోర్లకే వెనుదిరిగారు. 15 పరుగులు చేసి కెప్టెన్ రోహిత్ శర్మ... ఆసీస్ సారథి పాట్ కమిన్స్ విసిరిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో నిలదొక్కుకున్నట్టే కనిపించిన యువ ఆటగాడు గిల్... బోలాండ్ విసిరిన బంతిని అంచనా వేయడంలో పొరబడి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ బంతిని వదిలేయాలని గిల్ భావించగా, నేరుగా వచ్చి ఆఫ్ స్టంప్ ను ఎగరగొట్టింది.

రోహిత్, గిల్ ఆరంభంలో చెరో రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్టే కనిపించారు. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వెంట వెంటనే ఇద్దరూ పెవిలియన్ బాటపట్టారు. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 10 ఓవర్లలో 2 వికెట్లకు 37 పరుగులు. ఛటేశ్వర్ పుజారా (3 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 432 పరుగులు వెనుకబడి ఉంది.

More Telugu News