KTR: స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంతే చెప్పారు: కేటీఆర్ వ్యాఖ్య

  • గతంలో రెడ్ టేప్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు రెట్ కార్పెట్ ప్రభుత్వం ఉందన్న కేటీఆర్
  • నైపుణ్యం ఉంటే ఎక్కడైనా బతకవచ్చునని విద్యార్థులకు సూచన
  • తొమ్మిదేళ్లలో ఏం సాధించామో చెప్పిన మంత్రి కేటీఆర్
KTR puja for skill development centre

తెలంగాణలో గతంలో రెడ్ టేప్ ప్రభుత్వం ఉంటే, ఇప్పుడు రెడ్ కార్పెట్ ప్రభుత్వం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మెట్టుగడ్డలోని గర్ల్స్ ఐటీఐలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కు కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మనుషులందరికీ దేవుడు ఒకేలా తెలివితేటలు ఇచ్చాడన్నారు. గురుకుల స్కూల్స్ నుండి ఐఐఎం, ఐఐటీలలో విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారన్నారు. కంపెనీల్లో ఉద్యోగాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. నైపుణ్యాలు అలవరుచుకుంటే ఉద్యోగాలు వాటంతట అవే వస్తాయన్నారు. నైపుణ్యం ఉంటే ఎక్కడైనా బతకవచ్చునన్నారు. నైపుణ్యం ఉన్నప్పటికీ చాలామంది విద్యార్థులు భయం కారణంగా ఆగిపోతున్నారన్నారు. విద్యార్థులను ప్రపంచంలో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు.

తెలంగాణ గత తొమ్మిదేళ్లలో ఏం సాధించిందని కొంతమంది అడుగుతున్నారని, వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగాన ఉన్నామని, ఐటీ ఎగుమతులు రూ.2.40 లక్షల కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్నారు. మూడు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 9 లక్షలు దాటిందన్నారు. హైదరాబాద్ బాగా మారిపోయిందని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారని గుర్తు చేశారు. కొత్త ప్రాంతాలకు వెళ్తే హైదరాబాద్ లో ఉన్నామా లేక న్యూయార్క్ లో ఉన్నామా అనే సందేహం కలుగుతోందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, నిరంతర విద్యుత్.. ఇవన్నీ తొమ్మిదేళ్లలో సాధించామన్నారు.

More Telugu News