Crack Found In Train Coach: బోగీ చాసిస్ లో పగుళ్లు.. రైల్వే సిబ్బంది అప్రమ‌త్తం.. తమిళనాడులో కొల్లాం - చెన్నై ఎక్స్‌ప్రెస్ కు త‌ప్పిన ముప్పు!

  • రైలు ఎస్3 కోచ్ బేస్ వద్ద పగుళ్లు ఏర్పడినట్లుగా గుర్తించిన రైల్వే సిబ్బంది
  • పగుళ్లు ఏర్పడిన కోచ్ ను తప్పించి, వేరే కోచ్ ఏర్పాటు చేసిన అధికారులు
  • పగుళ్లను గుర్తించి, అప్రమత్తం చేసిన సిబ్బందికి అభినందనలు
Crack Found In Train Coach In Tamil Nadu Major Accident Averted

తమిళనాడులోని కొల్లాం - చెన్నై ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ఎస్3 కోచ్ చాసిస్ లో పగుళ్లు ఏర్పడినట్లుగా రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో రైలును నిలిపివేసి.. ప్రయాణికులను పక్క బోగీలోకి పంపారు. ఆ పగుళ్లు ఏర్పడిన బోగీని రైలు నుంచి వేరు చేసి దాని స్థానంలో కొత్త కోచ్‌ను చేర్చారు. కాస్త ఆలస్యంగా రైలు తిరిగి బయల్దేరింది.

‘‘ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ కొల్లాం నుంచి చెన్నైకి ఆదివారం మధ్యాహ్నం 3.30కు బయలుదేరింది. రైలు సాయంత్రం సెంగోట్టై స్టేషన్‌కు చేరుకున్నాక.. ఎస్3 కోచ్ బేస్ వద్ద పగుళ్లు ఏర్పడినట్లుగా రైల్వే సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు’’ అని దక్షిణ రైల్వే తెలిపింది. దీంతో రైలును కొద్ది సేపు అక్కడే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పగుళ్లు ఏర్పడిన కోచ్ ను తప్పించి, వేరే కోచ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 4.40కి ట్రైన్ బయల్దేరినట్లు వివరించారు. పగుళ్లను గుర్తించి, అప్రమత్తం చేసిన సిబ్బందిని అభినందిస్తామని చెప్పారు. మదురై డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌ ద్వారా అవార్డు ఇప్పిస్తామని వెల్లడించారు.  

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో గత శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 275 మంది చనిపోగా, 1,175 మంది దాకా గాయపడ్డారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో సమస్యే ప్రమాదానికి కారణమైనట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు సిఫార్సు చేసినట్లు తెలిపారు.

More Telugu News