Jupalli Krishna Rao: మేం వెళ్లడం కాదు.. ఈటలను కూడా మాతో రావాలని కోరాం: జూపల్లి

  • కేసీఆర్ ను గద్దె దింపడమే తమ ఏకైక లక్ష్యమన్న జూపల్లి
  • తమతో పాటు అందరూ రావాలని విన్నపం
  • వచ్చే నెలలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడి
We are requesting Etela to come with us says Jupalli Krishna Rao

బీఆర్ఎస్ బహిష్కృత నేతలైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరబోతున్నారనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వారిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

ఇక బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ వారితో పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. వారు బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. అయినా వారు బీజేపీలో చేరుతామని చెప్పలేదు. దీంతో వారిద్దరూ బీజేపీలో చేరడం కష్టమేనని ఈటల మీడియా ముఖంగా చెప్పారు. వారితో భేటీ అయినప్పుడు తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. 

మరోవైపు తాజాగా జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీలోకి వెళ్లడం కాదని, ఈటలనే తమతో పాటు రావాలని కోరామని చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించడమే తమ ఏకైక లక్ష్యమని అన్నారు. వచ్చే నెలలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. తమతో పాటు అందరూ కలిసి రావాలని కోరుతున్నామని చెప్పారు.

More Telugu News