IPL 2023: అభిమానం అంటే ఇది.. ధోనీ కోసం వచ్చి​ రైల్వే స్టేషన్​లో నిద్రించిన ఫ్యాన్స్

  • సీఎస్కే, జీటీ మధ్య ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం అడ్డంకి
  • నేటికి వాయిదా పడిన తుదిపోరు
  • రాత్రి రైల్వే స్టేషన్లో తలదాచుకున్న ధోనీ అభిమానులు
Dhoni fans slept Ahmedabad railway station sunday night

ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ కోసం అభిమానులు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియానికి పోటెత్తారు. భారీ వర్షం, ప్రతికూల వాతావరణంలోనూ ఫ్యాన్స్‌ ధోనీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మ్యాచ్‌ కోసం సీఎస్కే అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. స్టేడియం పరిసరాలు సీఎస్కే జెర్సీలతో పసుపు మయం అయ్యాయి. స్టేడియంలోకి వచ్చిన అభిమానులు అంత వర్షంలోనూ ధోనీ ధోనీ అంటూ అరుస్తూ కనిపించారు. వర్షం ఆగుతుంది మ్యాచ్ జరుగుతుందని భావించి రాత్రి వరకూ స్టేడియంలోనే ఉన్నారు. కానీ, భారీ వర్షం వల్ల కనీసం టాస్ కూడా పడకపోవడంతో రాత్రి 11 గంటలకు తుదిపోరును రిజర్వ్ డే అయిన ఈ రోజుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

దీంతో, అభిమానులంతా నిరాశగా వెనుదిరిగారు. ఈ రోజు ఫైనల్ జరగనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్ కు వచ్చిన అభిమానులు వసతి లేక రైల్వే స్టేషన్లలో నిద్రిస్తూ కనిపించారు. స్టేడియం నుంచి తెల్లవారు జామున 3 గంటలకు స్టేషన్ చేరుకొని నేలపైనే పడుకున్నారు. వారిలో చాలా మంది ఎల్లో జెర్సీలు వేసుకొని ఉన్నారు. కేవలం ధోనీ కోసమే తాము ఇంతదూరం వచ్చామని, అతని ఆట చూసిన తర్వాతే తిరిగి వెళ్తామని చెబుతున్నారు. ఇలాంటి అభిమానుల కోసమైనా ఈ రోజు రాత్రి ఫైనల్ మ్యాచ్ ఎలాంటి అడ్డంకి లేకుండా జరగాలని, ధోనీసేన గెలవాలని అంతా కోరుకుంటున్నారు.

More Telugu News