TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు

  • 29 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • బుధవారం 75 వేల మందికి శ్రీవారి దర్శనం
  • కొండపైన భద్రతా ఏర్పాట్లపై అధికారుల సమీక్ష
Nearly 20 hours waiting for Srivari darshan in Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం 74,995 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. గురువారం (నేడు) స్వామి దర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి భక్తులు బుధవారం సమర్పించుకున్న మొక్కులతో హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీ పెరగడం, ఇటీవల ఆలయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తిరుమలలో సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రెండు రోజుల పాటు శ్రీవారి ఆలయం, క్యూలైన్లను సెక్యూరిటీ కమిటీ పరిశీలించింది. అనంతరం జరిపిన సమీక్షలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్యూరిటీ కమిటీ ముఖ్య అధికారి హరీశ్ కుమార్ గుప్త మాట్లాడుతూ.. తిరుమలలో యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతను కట్టుదిట్టం చేస్తామని వివరించారు. టీటీడీ అధికారులతో కలిసి శ్రీవారి ఆలయం, మాడవీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రింగ్ రోడ్లు, వాటర్ పంపింగ్ హౌస్, నారాయణగిరి ఉద్యానవనం, క్యూలైన్లు, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాంతాలను హరీశ్ కుమార్ గుప్త పరిశీలించారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అనుసంధానిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, తనిఖీలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బాడీ స్కానర్స్‌ను ప్రతిపాదించినట్టు టీటీడీ వర్గాల సమాచారం.

More Telugu News