YS Sharmila: ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వని కేసీఆర్ దద్దమ్మ కాదా?: వైఎస్ షర్మిల

  • వందలాది మంది నిరుద్యోగుల ఉసురు తీసిన ఘనత కేసీఆర్ ది కాదా? అని ప్రశ్నించిన షర్మిల
  • బిస్వాల్ కమిటీ లక్షా 91 వేల ఖాళీలు ఉన్నాయన్నది వాస్తవం కాదా? అని ప్రశ్న
  • యువత ఉద్యోగ ఆకాంక్షలకు కేటీఆర్ పాతరేశారని విమర్శ
Sharmila fires on KCR and KTR

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. గ్రూప్-1 పరీక్షలు రాయొద్దని, ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్ కాదా? అని ఆమె ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ కాదా? అని మండిపడ్డారు. కొలువులు ఇవ్వకుండా వందలాది మంది నిరుద్యోగుల ఉసురు తీసిన ఘనత కేసీఆర్ ది కాదా? అని నిలదీశారు. 

ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న ఒక్క కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించారా? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని యువతను వంచించింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. బిస్వాల్ కమిటీ లక్షా 91 వేల ఖాళీలు ఉన్నాయన్నది వాస్తవం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ పై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. దేశంలో ఎంప్లాయ్ మెంట్ పాలసీ తీసుకురావాలంటున్న చిన్నదొర కేటీఆర్... రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలకు డిజిటల్ సెక్యూరిటీ కల్పించకపోవడం ఐటీ మంత్రిగా మీ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. యువతను బలిపశువులను చేసింది కేసీఆర్ ఐతే, అదే యువత ఉద్యోగ ఆకాంక్షలకు పాతరేసింది కేటీఆర్ అని విమర్శించారు. మీకు సిగ్గుంటే ముక్కు నేలకు రాసి, యువతకు క్షమాపణ చెప్పి, లక్షా 91 వేల ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చి, నిరుద్యోగ భృతి అమలు చేయాలని సవాల్ విసిరారు.

More Telugu News