Ganta Srinivasa Rao: రుషికొండకు బోడిగుండు తప్ప.. ఉత్తరాంధ్రకు ఏం అభివృద్ధి చేశారు?: గంటా శ్రీనివాసరావు మండిపాటు

  • వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న గంటా
  • శంకుస్థాపన చేసిన వాటికే నిన్న సీఎం శంకుస్థాపనలు చేశారని విమర్శ 
  • డిఫెన్స్ ఎయిర్ పోర్టుకు, సాధారణ ఎయిర్ పోర్టుకు మధ్య తేడా జగన్‌కు తెలియదని ఎద్దేవా
former minister ganta srinivas rao challenge to cm jagan over development

వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎం జగన్ కు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. రుషికొండకు బోడిగుండు తప్ప.. ఉత్తరాంధ్రకు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో నాలుగేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. సీఎం చర్చకు రావాలి’’ అని సవాల్ విసిరారు.

డిఫెన్స్ ఎయిర్ పోర్టు, సాధారణ ఎయిర్ పోర్టుకు మధ్య తేడా జగన్‌కు తెలియదని గంటా ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు జీఎంఆర్ బినామీ అని గతంలో విమర్శలు చేశారని, మర్చిపోయారా అని ప్రశ్నించారు. శంకుస్థాపన చేసిన వాటికే నిన్న సీఎం శంకుస్థాపనలు చేశారని విమర్శించారు. అదాని డేటా సెంటర్, భోగాపురం ఎయిర్ పోర్ట్.. టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసినవేనని చెప్పుకొచ్చారు.

ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై చేసిన వ్యాఖ్యలను మీడియా ముందు వినిపించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు 2,700 ఎకరాలు ఉండాలని చంద్రబాబు భూ సేకరణ చేశారని.. ఇప్పుడు 500 ఎకరాలు తీసేసి జగన్ శంకుస్థాపన చేశారన్నారు.

టీడీపీ నేతలపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెడుతోందని.. సిట్ వేసినా భయపడేది లేదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని హెచ్చరించారు. రజనీకాంత్‌పై పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నాయని.. జగన్ కంట్రోల్ చేయాలని హితవుపలికారు.

More Telugu News