acid: విజయవాడలో దారుణం.. అప్పు తీసుకున్న మహిళపై యాసిడ్ దాడి

  • ఓ వ్యక్తి నుండి రూ.20 వేలు అప్పు తీసుకున్న బాధితురాలు
  • అప్పు, వడ్డీ చెల్లించాలంటూ పలుమార్లు అడిగిన నిందితుడు
  • ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పు తీర్చలేకపోయిన మహిళ
  • నిన్న రాత్రి ఇంటికెళ్లి యాసిడ్ దాడి
  • కుటుంబ సభ్యులు వచ్చేలోపు పారిపోయిన దుండగుడు
Acid attack on woman in Vijayawada

విజయవాడ, పెడనలో దారుణం జరిగింది. 20వ వార్డులోని రామలక్ష్మి కాలనీలో మోకా కరుణ కుమారిపై ఓ వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు వచ్చేలోపు దుండగుడు పరారయ్యాడు. యాసిడ్ దాడి సమయంలో కరుణ తనను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేసింది.

కరుణ కుటుంబ సభ్యుల పోషణ కోసం ఓ కంపెనీలో పని చేస్తోంది. ఆమె కొంతకాలం క్రితం ఓ వ్యక్తి వద్ద 5 రూపాయల వడ్డీ కింద రూ.20 వేలు అప్పు చేసింది. గడువులోగా ఆమె అప్పు తీర్చలేదు. పైగా రెండు నెలలుగా ఆమె వడ్డీ కట్టలేదు. దీంతో అతను నిత్యం డబ్బులు అడుగుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె అప్పు తీర్చలేకపోయింది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆమె ఇంటికి వెళ్లి... బయటకు పిలిచాడు. అప్పు గురించి అడిగే క్రమంలో ఆ తర్వాత యాసిడ్ దాడి చేశాడు. అంతకుముందు పలుమార్లు ఆమెతో అసభ్యంగా మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. తనతో వస్తే అప్పు మాఫీ చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది.

More Telugu News