brs: అధైర్య పడొద్దు.. రైతులను ఆదుకుంటాం: మంత్రి హరీశ్ రావు

  • నిన్న రాత్రి వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలు
  • సిద్దిపేటలో పంటలను పరిశీలించిన హరీశ్ రావు
  • ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని మంత్రి హామీ 
Minister Harish Rao Says Government Will help rain affected Farmers

వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. అధైర్యపడొద్దని రైతులకు భరోసానిచ్చారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింది. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి హరీశ్‌ రావు వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటనష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందిస్తామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్నారు. యుద్ధప్రాతిపదికన నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు సేకరించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. వడగళ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.  రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్‌లోనే వరి నాట్లు వేసి, కోతలు పూర్తి చేసి నష్టం నుంచి బయట పడ్డారన్నారు. భవిష్యత్తులో ఒక్క నెల ముందుకు సీజన్ తేవడానికి రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.

More Telugu News