Nara Lokesh: ఒక్క సంవత్సరం ఓపికపట్టండి... ఆ బిల్లులు ఎవరూ కట్టొద్దు: నారా లోకేశ్

  • ఆదోని నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • నేడు సర్పంచులతో సమావేశం
  • తుంబళం క్రాస్ వద్ద 'పల్లె ప్రగతి కోసం మీ లోకేశ్' కార్యక్రమం
  • సర్పంచుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన లోకేశ్
Lokesh answers Panchayatraj representatives questions

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా గ్రామాల్లో 24/7 తాగునీరు అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. 

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ వద్ద పంచాయతీరాజ్ ప్రతినిధులతో నిర్వహించిన 'పల్లె ప్రగతి కోసం మీ లోకేశ్' కార్యక్రమంలో లోకేశ్ గ్రామీణాభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ విధానాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు సంధానకర్తగా వ్యవహరించారు. 

సంధానకర్త లక్ష్మీ ముత్యాలరావు అడిగిన ప్రశ్నలకు యువనేత సమాధానాలు:

ప్రశ్న: గ్రామాల సమస్యలను మీరు ఏవిధంగా పరిష్కరిస్తారు?

లోకేశ్: పల్లెటూరుకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవచేసినట్లే. నేను 24 నెలలు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశాను. 35 లక్షల వీధిదీపాలు, 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, మోడల్ విలేజీలు, పాఠశాలలకు ప్రహరీలు, సంపద తయారీ కేంద్రాలు, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఎన్టీఆర్ జలధార వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. కానీ నేడు సర్పంచులకు కనీస గౌరవం లేదు. నిధులు, విధులు లేకుండా సర్పంచులు ఉన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా పనులు చేశామో, అవి తప్ప కొత్తగా పనులేవీ జరగలేదు. మేం అధికారంలోకి వచ్చాక గ్రామాలను అభివృద్ధి చేస్తాం. గ్రామాలను పట్టణాలకు దీటుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఫైబర్ గ్రిడ్ ను మళ్లీ పునరుజ్జీవింపజేసి ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం వచ్చేలా చేస్తాం.

ప్రశ్న: రాష్ట్రాభివృద్ధిలో పంచాయతీల పాత్రపై టీడీపీ విధానం ఎలా ఉంటుంది?

లోకేశ్: సమగ్ర గ్రామీణాభివృద్ధి జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మున్సిపాలిటీలు, పంచాయతీలకు మధ్య మేజర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిని వివిధ రాష్ట్రాల్లో ఎలా అభివృద్ధి చేస్తున్నారో మేం పరిశీలిస్తున్నాం. అధికారంలోకి వచ్చాక మేజర్ పంచాయతీలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. గతంలో చిన్న పంచాయతీల్లో 10 శాతం పంచాయతీ నిధులు ఖర్చు పెడితే, 90 శాతం ప్రభుత్వం ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. కొన్ని పంచాయతీలకు 30:70 నిష్పత్తి, 50:50 నిష్పత్తిలో నిధులిచ్చాం. పంచాయతీలను అభివృద్ధి చేశాం.

ప్రశ్న: గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఏమైనా పనులు చేయలేదని బాధపడుతున్నారా?

లోకేశ్: నేను హైదరాబాద్ వాతావరణంలో పెరిగాను. కానీ నేను మంత్రిగా వచ్చినప్పుడు రాయలసీమ పల్లెలను చూస్తే బాధగా అనిపించింది. గ్రామాలను అభివృద్ధి చేయాలని సంకల్పించాను. కానీ ఇంటింటికీ నీటి కుళాయి, భూగర్భ డ్రైనేజీ పనులు చేయలేకపోయాను. ఈ రెండూ పల్లెలకు చేసి ఉంటే నేడు ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కాదు. మేం అధికారంలోకి వచ్చాక ఈ రెండు పనులూ చేస్తాం.

సర్పంచ్ ల ప్రశ్నలకు లోకేశ్ సమాధానాలు:

హెలీనా, రాజోలు: సర్పంచి అయ్యి రెండున్నరేళ్లు. మాకు విధులు, నిధులు లేవు. అనేక ఉద్యమాలు చేశాం. ప్రభుత్వంలో చలనం లేదు. మీరు అధికారంలోకి వస్తే సర్పంచులు పడే ఇబ్బందులను ఎలా పరిష్కరిస్తారు?

లోకేశ్: రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు, చివరకు సర్పంచులతో సహా బాధితులుగా మారారు. సర్పంచులకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. వాటిని వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోంది. సర్పంచులను గెలిపించిన ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం నుండి సహాయ,సహకారాలు అందకపోవడంతో సర్పంచులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు లేవు. సర్పంచులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులున్నాయి. పంచాయతీ ఖాతాలకే మేం నిధులు ఇస్తాం. 

పగడాల రమేష్, వైసీపీ సర్పంచ్, సింగనపల్లి గ్రామం, ప్రకాశంజిల్లా: సర్పంచులకు మీరు అధికారంలోకి వచ్చాక ఏం న్యాయం చేస్తారు? వైసీపీ సర్పంచులను ఆదుకుంటారా? 

లోకేశ్: మీడియా ఎదుటే వైసీపీ దుష్టపాలనను నిరసిస్తూ మీరు చెప్పులతో కొట్టుకున్నారు. నేనొక జత చెప్పులు ఇస్తా, ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు చెప్పులతో కొట్టాలి. వైసీపీ పాలనలో సర్పంచుల వ్యవస్థ నిర్వీర్యమైంది. టీడీపీ పాలనలో సర్పంచులకు గౌరవ వేతనాలను పెంచలేదు. కానీ పనులు చేయడానికి మేం నిధులిచ్చి సర్పంచుల గౌరవాన్ని నిలబెట్టాం. మేం అధికారంలోకి వచ్చాక పార్టీలతో సంబంధం లేకుండా, గ్రామీణాభివృద్ధికి పాటుపడే సర్పంచులను ప్రోత్సహిస్తాం. మేం అధికారంలోకి వచ్చాక 25 సంవత్సరాల దామాషాను చూసుకుని పంచాయతీలకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను ఏర్పాటు చేసి ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరు అందిస్తాం. సర్పంచులకు చెక్ పవర్  ఉండేలా చర్యలు తీసుకుంటాం. మెరుగైన గౌరవ వేతనంతో సర్పంచులకు గౌరవాన్ని పెంచుతాం. 

తిమోతీ, జనసేన సర్పంచ్, కృష్ణాజిల్లా: వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను లాక్కుంది. నాకు ఉన్న పరిశ్రమను వదిలేసి గ్రామానికి ఏదైనా చేద్దాం అని సర్పంచ్ అయ్యాను. సర్పంచుల సమస్యలపై పోరాటాలు సరైన రీతిలో జరగలేదు. వలంటీర్లు, మాపై ఓడిపోయిన వైసీపీ వాళ్లు మా విధులను లాక్కున్నారు. రాజకీయాలపై విరక్తి వస్తోంది. మీరు మమ్మల్ని ఎలా ఆదుకుంటారు?

లోకేశ్: రాజకీయాలపై ఏ ఒక్కరికీ విరక్తి రాకూడదు. నాపై 20 కేసులు పెట్టినా నేను విసుగు చెందలేదు. మనం నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి పోరాడాలి. కష్టకాలంలో పోరాడితేనే మన రాటుదేలతాం. కలిసికట్టుగా పోరాడాలి, సమస్యల్ని పరిష్కరించుకోవాలి. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ కూడా తాము తీసుకుంటున్న వేతనాలు ప్రజలు కట్టే పన్నుల నుండి తీసుకుంటున్నారని తెలుసుకోవాలి. వాళ్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. నేడు స్టిక్కర్లు అతికించే కార్యక్రమంలో వలంటీర్లు పాల్గొంటున్నారు. 

లెనిన్ బాబు, సీపీఐ సర్పంచ్, కఠారిగుంట, పత్తికొడ నియోజకవర్గం: సచివాలయాల్లో సర్పంచులకు ప్రథమ పౌరునిగా గౌరవం దక్కడం లేదు. మమ్మల్ని ఏ కార్యక్రమంలోనూ కలుపుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా? 

లోకేశ్: ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామీణాభివృద్ధి సాధ్యం. సచివాలయ వ్యవస్థను మేం రద్దు చేయడం లేదు. వలంటీర్లు పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. అది ఉండకూడదు. పంచాయతీల నిధులను సంక్షేమ పథకాల కోసం మళ్లించుకుంటున్నామని వైసీపీ చెబుతోంది. కానీ మేం సంక్షేమ పథకాలు అమలు చేసి కూడా పంచాయతీ నిధులు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 16,918 పంచాయతీలను నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రేడింగ్ చేసి అవసరం మేరకు నిధులు ఇచ్చాం. ఉపాధిహామీ పథకానికి 36 పనులను అనుసంధానం చేసి మేం నిధులు ఇచ్చాం. 

రామకృష్ణనాయుడు, ఆముదాలవలస, శ్రీకాకుళం జిల్లా: వైసీపీ పాలనలో మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామీణ వ్యవస్థ నాశనమైంది. మీరు అధికారంలోకి వచ్చాక గ్రామాలకు పూర్వవైభవాన్ని తీసుకువస్తారా? పంచాయతీ నిధుల కోసం నేను పోరాడినందుకు 12 కేసులు పెట్టారు. వీటిలో రేప్ కేసు కూడా ఉంది. మా నిధులు, విధులు కోసం మీరు కూడా పోరాడతారా?

లోకేశ్: రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నేను పాదయాత్ర చేస్తున్నాను. మనమంతా ఒకసారి చర్చించి మీతో కలిసి పోరాడటానికి నిర్ణయం తీసుకుందాం. టీడీపీ పాలనలో వీధి దీపాల సమస్యల్ని కూడా డ్యాష్ బోర్డులో పెట్టి సమస్యలు పరిష్కరించాం. నేడు వీధి దీపాలు వేసే దిక్కులేదు. మేం అధికారంలోకి వచ్చాక మీ సమస్యల్ని పరిష్కరిస్తాం.

రాధిక, మంత్రాలయం, హనుమాపురం ఎంపీటీసి: ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు నిధులు లేవు. మీరు వచ్చాక ఇస్తారా?

లోకేశ్: మేం అధికారంలోకి వచ్చాక ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నిధులు కేటాయిస్తాం. మేం అధికారంలో ఉండగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను నిర్మించాం. కానీ నేడు అవి తాగుబోతుల అడ్డాలుగా మారాయి. వైసీపీ చేపట్టిన తడిచెత్త, పొడిచెత్త కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. స్వచ్ఛ భారత్ మిషన్-2 కింద కేంద్రం నిధులు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను సరిగా వినియోగించడం లేదు. అందుకే గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు రావడం లేదు. మేం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను సజావుగా నిర్వహిస్తాం. 

శ్రీనివాసులు, రామపురం గ్రామం, పెనుగొండ: మేం సర్పంచులుగా ఎందుకు గెలిచామా అని బాధపడుతున్నాం. మాకు విధులు ఏమీ లేవు. ప్రజలకు సేవచేసే అవకాశం సర్పంచులకు ప్రభుత్వం ఇవ్వడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మాకు విధులు, నిధులు ఇస్తారా?

లోకేశ్: సర్పంచులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నింటినీ అమలు చేస్తాం. వలంటీర్లు, సచివాలయాలు, సర్పంచులను అనుసంధానం చేస్తాం. సర్పంచులకు విధులు, నిధులు ఇస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఇస్తాం.

గోపాలకృష్ణ, బీజేపీ సర్పంచ్, ఉప్పలూరు, కడప: గతంలో కొన్ని వృత్తులకు కరెంటు బిల్లులు మినహాయింపు ఉండేది. నేడు అది రద్దయ్యింది. మీరు వచ్చాక మమ్మల్ని ఏ విధంగా ఆదుకుంటారు?

లోకేశ్: మేం అధికారంలోకి వచ్చే సమయానికి రూ.1,850 కోట్లు పంచాయతీలకు బకాయిలుండేవి. వాటిని మేం రెండు విడతల్లో కొంతమేరకు పూర్తిచేశాం. ఇప్పుడు ఈ భారాన్ని పంచాయతీలపై వైసీపీ ప్రభుత్వం వేసింది. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే పంచాయతీల బకాయిలను నాలుగు విడతల్లో కడతాం.

కాట్రపాడు సర్పంచ్, గుంటూరుజిల్లా: వైసీపీ దోచుకున్న నిధులను మాకు ఇస్తారా? మీ ప్రభుత్వం కేటాయించే నిధులే ఇస్తారా?

లోకేశ్: పంచాయతీ నిధులు దారి మళ్లడం వల్ల కేంద్రం ఇవ్వాల్సిన రూ.2,200కోట్లను కేంద్రం నిలిపేసింది. పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం లాక్కున్న నిధులను ఇచ్చే విధానంపై పార్టీతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు చివరిగా రూ.14 వేల కోట్లు ఉపాధి హామీ నిధులను తీసుకున్నాం. కానీ నేడు కేంద్రం ఏపీకి ఉపాధి హామీ నిధులను తగ్గించింది. కరెంటు బిల్లుల భారం సర్పంచులపై పడకుండా మేం చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: గత ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇస్తే, ఆ కాలం నాటి బిల్లులు పెండింగ్ ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం బిల్లులు వసూలు చేస్తోంది. మీరు దాన్ని ఎలా పరిష్కరిస్తారు?

లోకేశ్: ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి. బిల్లులు ఎవరూ కట్టొద్దు. మేం వచ్చాక చెల్లిస్తాం.

మోహన్ రెడ్డి, పాణ్యం: స్థానిక ఎమ్మెల్యే సర్పంచులను చంపుతామని బెదిరిస్తున్నాడు. ఏపీఐఐసీ భూములను ఎమ్మెల్యే లాక్కున్నాడు. మీరు అధికారంలోకి వచ్చాక ఆ భూములను కాపాడాలి.

లోకేశ్: ఓర్వకల్లులో పరిశ్రమలు పెట్టేందుకు భూములను ఏపీఐఐసీ ద్వారా సేకరించాం. మేం అధికారంలోకి వచ్చాక కర్నూలు కేంద్రంగా ఫార్మా పరిశ్రమలు పెట్టి యువతకు ఉద్యోగాలు ఇస్తాం. కర్నూలును అభివృద్ధి చేస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 1020 కి.మీ.*

*80వ రోజు (25-4-2023) యువగళం వివరాలు:*

*మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*

ఉదయం

8.00 – తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.20 – మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

8.30 – గవిగట్టు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

9.05 – బాపులదొడ్డి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

9.55 – పేకలబెట్ట క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

మధ్యాహ్నం

12.00 – కోసిగిలో స్థానికులతో మాటామంతీ.

12.30 – కోసిగి యల్లమ్మ దేవాలయం సమీపంలో భోజన విరామం.

సాయంత్రం

5.00 – కోసిగి యల్లమ్మ దేవాలయం వద్ద బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

6.15 – కోసిగి బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.

6.25 – కోసిగి తేరుబజార్ వద్ద షాప్ కీపర్లతో భేటీ.

7.00 – కోసిగి చింతకుంట క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

7.10 – కోసిగి శివారు విడిది కేంద్రంలో బస.

More Telugu News