dharmapuri: ఎట్టకేలకు తెరుచుకున్న ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు!

  • హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగులగొట్టిన అధికారులు 
  • ఈ నెల 26వ తేదీలోగా హైకోర్టుకు డాక్యుమెంట్ల అందజేత
  • 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నికపై కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపణలతో వివాదం
dharmapuri strong room doors are opened

ఎట్టకేలకు ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు ఆదివారం ఉదయం పగులగొట్టారు. లోపల ఉన్న డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకుని, ఈ నెల 26వ తేదీలోగా హైకోర్టుకు సమర్పించనున్నారు.

2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై తమకు నివేదిక ఇవ్వాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది. 

కోర్టు ఆదేశాలతో ఈనెల 10న స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కానీ తాళం చెవులు మిస్ కావడంతో హైడ్రామా కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎన్నికకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. 

తాళాలు తీసిన తర్వాత స్ట్రాంగ్‌ రూంలోని ఫైళ్లు, ఈవీఎంలు తరలించేందుకు రిటర్నింగ్‌ అధికారి అడిగిన వాహనాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన భద్రతను కల్పించాలని సూచించింది. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న డాక్యుమెంట్లు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం స్ట్రాంగ్ రూమ్ తాళాలను నాటి అభ్యర్థులు, రాజకీయ పార్టీల సమక్షంలోనే పగులగొట్టారు.

More Telugu News