SS Montevideo Maru: 81 ఏళ్ల కిందట 1000కి పైగా యుద్ధఖైదీలతో మునిగిపోయిన నౌక.... ఇప్పుడు బయటపడింది!

  • రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మునిగిపోయిన జపాన్ నౌక
  • శత్రునౌకగా పొరబడి దాడి చేసిన అమెరికా జలాంతర్గామి
  • జపాన్ నౌకలో యుద్ధఖైదీలు, పౌరులు
  • మృతి చెందిన వారిలో 976 మంది ఆస్ట్రేలియా జాతీయులు
  • దేశం కోసం పాటు పడినవారిని ఎప్పుడూ గుర్తుంచుకుంటామన్న ఆస్ట్రేలియా ప్రధాని
81 Years back sunken ship found in South China sea

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మునిగిపోయిన నౌక ఇన్నాళ్లకు బయటపడింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో, పసిఫిక్ మహా సముద్రంలోని పాపువా న్యూ గినియా దీవుల్లో చాలామందిని యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నారు. 1942 జూన్ 22న వారిని ఎస్ఎస్ మాంటెవిడియో మారు అనే జపాన్ నౌకలో హైనాన్ ద్వీపానికి తరలించే ప్రయత్నం చేశారు. హైనాన్ ద్వీపం నాడు జపాన్ అధీనంలో ఉంది. 

1000 మందికి పైగా యుద్ధ ఖైదీలు, పౌరులతో ఆ నౌక ప్రయాణం సాగించింది. అయితే, అమెరికా జలాంతర్గామి పొరబాటున ఈ నౌకను శత్రువులదిగా భావించి దాడి చేసింది. ఈ ఘటనలో 1,080 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 979 మంది ఆస్ట్రేలియా జాతీయులే. దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న జపాన్ నౌక ఎస్ఎస్ మాంటెవిడియో మారు సముద్రంలో మునిగిపోయింది. 

ఈ నౌకను వెలికితీయాలన్న డిమాండ్ల నేపథ్యంలో, ఆస్ట్రేలియా రక్షణ శాఖ, ఆస్ట్రేలియా ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్, సైలెంట్ వరల్డ్ ఫౌండేషన్, నెదర్లాండ్స్ సముద్ర సర్వే సంస్థ పుగ్రో ఓ సంయుక్త కార్యాచరణ చేపట్టాయి. అత్యాధునిక పరికరాల సాయంతో నిర్వహించిన ఈ సెర్చ్ మిషన్ ఎట్టకేలకు ఫలిచింది. 

81 ఏళ్ల తర్వాత ఎస్ఎస్ మాంటెవిడియో మారు నౌక ఆచూకీ లభ్యమైంది. దక్షిణ చైనా సముద్ర గర్భంలో దీనిని గుర్తించారు. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పందించారు. దేశం కోసం పాటు పడిన వారిని ఎప్పటికీ విస్మరించబోమన్న వైఖరికి ఈ అన్వేషణ ఒక నిదర్శనం అని పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వారిని సదా గుర్తుంచుకుంటామని తెలిపారు. 

కాగా, సముద్ర గర్భంలో 4 వేల మీటర్ల లోతులో ఈ నౌక ఉందని ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రిచర్డ్ మార్లెస్ తెలిపారు. నౌక ఆచూకీ లభ్యమైన ప్రదేశం ఫిలిప్పీన్స్ లోని లూజాన్ ద్వీపం తీర ప్రాంతానికి సమీపంలో ఉంది.

More Telugu News