Karnataka: మోదీ మ్యాజిక్ ఇక్కడ కుదరదు: మాజీ సీఎం సిద్ధరామయ్య

  • బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందన్న సిద్ధరామయ్య 
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమంటూ ధీమా
  • సీఎం రేసులో తనతో పాటూ డీకే శివకుమార్ కూడా ఉన్నారని వెల్లడి
  • అంతిమంగా ఎవరు సీఎం అవుతారో పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టీకరణ
Modi cant do magic here says siddaramaiah says congress will win in upcoming elections

కర్ణాటకలో ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య తాజాగా ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన బెంగళూరులోని తన నివాసంలో జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కర్ణాటకలో బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తున్నందున కాంగ్రెస్‌నే విజయం వరిస్తుందన్నారు. ప్రధాని మోదీ మ్యాజిక్ కర్ణాటకలో పనిచేయదని అన్నారు.  

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు తానూ సీఎం పదవి రేసులో ఉన్నానని, అయితే సీఎం ఎవరయ్యేది హైకమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ‘‘నాకు, శివకుమార్‌కు మధ్య ఎటువంటి తగాదా లేదు. ఎన్నికల తరువాత సీఎం ఎవరవుతారనేది పార్టీ హైకమాండ్, కొత్త ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు’’ అని చెప్పుకొచ్చారు.  రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన లింగాయత్ వర్గం తమ పార్టీ విధానాల్ని అర్థం చేసుకుందని అన్నారు. వారి మద్దతు కాంగ్రెస్‌కు ఉందని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీ విద్వేష రాజకీయాలకు పాల్పడుతోందంటూ దుమ్మెత్తిపోసిన సిద్ధరామయ్య.. హలాల్, అజాన్, హిజాబ్ విషయాలను కాషాయ పార్టీ ఇప్పుడెందుకు లేవనెత్తుతోందని ప్రశ్నించారు. ముస్లింలకు కాంగ్రెస్ వంతపాడుతోందన్న బీజేపీ ఆరోపణలను ఆయన ఖండించారు. బీజేపీ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని సాగనంపేందుకు రెడీ అని సిద్ధరామయ్య చెప్పారు.

More Telugu News