Prize Money: దేశవాళీ టోర్నీలకు భారీగా ప్రైజ్ మనీ పెంచేసిన బీసీసీఐ

  • ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ
  • ఇప్పటికే పురుష, మహిళా క్రికెటర్లకు భారీ పారితోషికాలు
  • తాజాగా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ తదితర టోర్నీలకు ప్రైజ్ మనీ పెంపు 
BCCI hikes prize money for domestic cricket tourneys

ప్రపంచ క్రికెట్లో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి గుర్తింపు ఉంది. ఇప్పటికే బీసీసీఐ పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు పారితోషికాలు చెల్లిస్తోంది. క్రికెట్ ఆడే దేశాల్లో న్యూజిలాండ్, భారత్ మాత్రమే ఈ విధంగా సమాన ఫీజులు చెల్లిస్తున్నాయి. 

తాజాగా, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్ టోర్నీల ప్రైజ్ మనీ పెంచుతున్నట్టు వెల్లడించింది. దేశవాళీ క్రికెట్ కు వెన్నెముక వంటి రంజీ ట్రోఫీ విజేతగా రూ.5 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు బీసీసీ కార్యదర్శి జై షా వెల్లడించారు. ఇప్పటివరకు రంజీ విజేతకు రూ.2 కోట్ల నగదు బహుమతి ఇస్తున్నారు.

టోర్నీలకు ప్రైజ్ మనీ వివరాలు...

  • రంజీ ట్రోఫీ విజేతకు రూ.5 కోట్లు ఇస్తారు. ఫైనల్లో ఓడిపోయిన జట్టుకు రూ.3 కోట్లు ఇస్తారు. రంజీ ట్రోఫీ సెమీస్ లో ఓడిన జట్టుకు రూ. 1 కోటి అందించనున్నారు. గతంలో ఈ మొత్తం రూ.50 లక్షలుగా ఉంది.
  • దులీప్ ట్రోఫీ విజేతకు రూ.1 కోటి, రన్నరప్ కు రూ.50 లక్షలు అందించనున్నారు. ఇప్పటివరకు దులీప్ ట్రోఫీ విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు ఇచ్చేవారు.
  • విజయ్ హజారే ట్రోఫీలో విజేతకు ఇప్పటిదాకా రూ.30 లక్షలు ఇస్తుండగా, ఆ నగదు బహుమతిని రూ.1 కోటికి పెంచారు. అంతేకాదు, రన్నరప్ కు అందించే నగదును రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు.
  • దేవధర్ ట్రోఫీలో ఇప్పటివరకు విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.15 లక్షలు ఇస్తుండగా... ఇకపై విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు ఇస్తారు.
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతలకు ఇకపై రూ.80 లక్షలు, ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.40 లక్షలు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఫైనల్ విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.10 లక్షలు ఇచ్చేవారు.
  • ఇక సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ విజేతకు రూ.50 లక్షలు, రన్నరప్ కు రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఈ టోర్నీ విజేతకు రూ.6 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు ఇచ్చేవారు.
  • సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో ఇప్పటివరకు విజేతకు రూ.5 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు చెల్లించేవారు. ఇప్పుడు ఆ ప్రైజ్ మనీని భారీగా పెంచారు. విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు అందించనున్నారు.

More Telugu News