Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సింగరేణి డైరెక్టర్లు

  • తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో విశాఖ చేరుకున్న ప్రతినిధులు
  • ఈఓఐ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్న బృందం
  • సీఎండీ అందుబాటులో లేకపోవడంతో మార్కెటింగ్ అధికారులతో భేటీ
singareni directors visit to vizag steel plant

నాణ్యమైన ఉక్కుకు అంతర్జాతీయంగా పేరొందిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఇటీవల మూలధన సేకరణ కోసం బిడ్ లను ఆహ్వానించిన విషయం తెలిసిందే! ఈ బిడ్డింగ్ లో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవారం విశాఖ ఉక్కు ప్లాంట్ కు సింగరేణి ప్రతినిధుల బృందాన్ని పంపించారు. ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి కాలరీస్ కు చెందిన ముగ్గురు డైరెక్టర్ల ప్రతినిధి బృందం మంగళవారం విశాఖ చేరుకుంది. అయితే, ప్లాంట్ సీఎండీ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ రోజు మార్కెటింగ్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో తెలంగాణ ప్రతినిధుల బృందం భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

సింగరేణి కాలరీస్ తో జాయింట్ వెంచర్ కింద ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సాధ్యాసాధ్యాలను ఈ బృందం పరిశీలిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూలధన సేకరణలో భాగంగా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రతిపాదనల బిడ్డింగ్ కు ఈ నెల 15 లోగా సమ్మతి తెలపాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈఓఐ సాధ్యాసాధ్యాలు, స్టీల్ ప్లాంట్ సేకరించదలచిన నిధులు, వాటిని సమకూర్చడం ద్వారా పొందే ఉత్పత్తులు తదితర వివరాలపై విశాఖ ఉక్కు పరిశ్రమ ఉన్నతాధికారులతో చర్చలు జరిపేందుకు సింగరేణి కాలరీస్ ప్రతినిధి బ‌ృందం విశాఖ చేరుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ బృందం వెళ్లినట్లు సమాచారం.

More Telugu News