TTD: ప్లీజ్.. టోకెన్లు ఉన్న వారే రండి: టీటీడీ

  • వరుస సెలవులతో తిరుమల కొండపై భక్తుల రద్దీ
  • స్వామి వారి దర్శనానికి 30 గంటలుపైనే
  • ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారే రావాలని విజ్ఞప్తి
Heavy Rush In Tirumala TTD Request To Devotees

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు లభించిన సెలవులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది.

శుక్రవారం మొదలైన ఈ రద్దీ ఇంకా కొనసాగుతోంది. నేడు ఆదివారం కావడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వీరు స్వామి వారిని దర్శించుకునేందుకు 30 గంటలుపైనే పడుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక సూచన చేసింది.

తిరుమల కొండపై రద్దీ పెరగడంతో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న వారు మాత్రమే రావాలని విజ్ఞప్తి చేసింది. టోకెన్లు లేని వారు కూడా వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించింది. కాగా, స్వామి వారిని శుక్రవారం 71,782 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా 3.28 కోట్ల రూపాయల ఆదాయం లభించగా, 36,844 మంది తలనీలాలు సమర్పించినట్టు అధికారులు తెలిపారు.

More Telugu News