Nara Lokesh: నేను టెర్రరిస్టును కాదు... వారియర్ ని: నారా లోకేశ్

  • లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు 58వ రోజు
  • ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర
  • బత్తలపల్లిలో టీడీపీ బహిరంగ సభ
  • టీడీపీ బలం కార్యకర్తలేనన్న లోకేశ్
  • తనను భుజాలపై మోస్తున్నారని కితాబు
Lokesh reiterates that he is a warrior

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు నేడు 58వ రోజు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. బత్తలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ పాల్గొన్నారు. సభకు టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా లోకేశ్ ప్రసంగిస్తూ... కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం అని అభివర్ణించారు. తనను కార్యకర్తలే తమ భుజస్కందాలపై మోస్తున్నారని కొనియాడారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు సభకు తరలివచ్చారని పేర్కొన్నారు. ధర్మవరం చేనేతకు పుట్టినిల్లు అని లోకేశ్ వెల్లడించారు. ఎంతో చరిత్ర ఉన్న ధర్మవరంలో పాదయాత్ర చేయడం తన అదృష్టమని అన్నారు. 

పాదయాత్రలో తనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. తన వాహనం, మైక్, చివరికి స్టూల్ ను కూడా లాక్కున్నారని వివరించారు. కానీ రాయలసీమ ప్రజలు తనకు అండగా నిలిచారని తెలిపారు. తాను టెర్రరిస్ట్ ను కాదని, వారియర్ ని అని ఉద్ఘాటించారు. వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

బీసీలకు జగన్ వెన్నుపోటు పొడిచారని, బీసీలపై దాదాపు 26 వేల దొంగ కేసులు పెట్టారని లోకేశ్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జాకీ, అమరరాజా కంపెనీలను తెలంగాణకు పంపించివేశారని తెలిపారు. రాయలసీమ ముద్దుబిడ్డ మన చంద్రబాబు అని అభివర్ణించారు. టీడీపీ హయాంలోనే ధర్మవరం అభివృద్ధి జరిగిందని వివరించారు.

ఈ సందర్భంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏపీలోనే నెంబర్ వన్ కేటుగాడు అని అన్నారు. భూములు ఎక్కడున్నాయో చూసుకునేందుకే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం అని లోకేశ్ విమర్శించారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ముందు రోజే కేతిరెడ్డికి డబ్బులొస్తాయని, ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రోజూ రూ.30 లక్షలు వెళుతున్నాయని ఆరోపించారు. కేతిరెడ్డి రూ.1000 కోట్లు సంపాదించాడని వ్యాఖ్యానించారు. 

కేతిరెడ్డి ఏకంగా ఎర్రగుట్టనే మింగేశారని, దోపిడీని ఆధారాలతో సహా రుజువు చేస్తా... రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. కేటుగాడి దోపిడీని కలెక్టర్ ముందు పెడతామని, సిట్ వేస్తామని, పేదల భూములు తిరిగి ఇప్పిస్తామని తెలిపారు. 

ఏడాది ఓపిక పట్టండి... టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే టిడ్కో ఇళ్లు పూర్తి చేసి పేదలకు ఇస్తామని తెలిపారు. ధర్మవరం అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

More Telugu News