Employees: ఏపీ సీఎస్ తో ముగిసిన ఉద్యోగ సంఘాల సమావేశం

  • సచివాలయంలో 4 గంటలకు పైగా సమావేశం
  • హాజరైన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు
  • తమ డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించిన నేతలు
Employees meeting with CS concludes

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ముగిసింది. సచివాలయంలో 4 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఈ భేటీలో ఉద్యోగ సంఘాల తరఫున బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. 

కంట్రిబ్యూషన్ డబ్బును ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఉంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పీఆర్సీలో పెండింగ్ అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. మెడికల్ రీయింబర్స్ మెంట్ గడువు 2024 వరకు పొడిగించాలని ఉద్యోగులు కోరారు. ఉద్యోగుల ప్రతిపాదన ఆర్థికశాఖ వద్ద ఉందని ప్రభుత్వం వెల్లడించింది. జీపీఎఫ్ రుణాలు, బిల్లుల చెల్లింపు క్రమపద్ధతిలో చేస్తున్నామని వివరించింది. 

రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పందిస్తూ... హెల్త్ కార్డులు, 11వ పీఆర్సీ పెండింగ్ అంశాలపై చర్చించామని వెల్లడించారు. క్యాష్ లెస్ చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. పే స్కేల్ అంశాల గురించి సీఎస్ ఏమీ చెప్పలేదని అన్నారు. ఏపీజీఎల్ఐ ఆరు నెలలుగా జమ కాలేదన్న విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని సూర్యనారాయణ వెల్లడించారు. 

ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, హెల్త్ కార్డులకు వాటా చెల్లించినా ప్రయోజనం దక్కలేదని విచారం వ్యక్తం చేశారు. 104 వల్ల సమస్యలు పరిష్కారం కావడంలేదని తెలిపారు. 

ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ... వివిధ అంశాలపై అవగాహన కోసమే సమావేశం జరిపారని వెల్లడించారు. డీఏ, పీఆర్సీ అంశాలను వేర్వేరుగా చూడాలని స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. వచ్చే నెల 5న సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, ప్రకటన చేస్తామని వివరించారు. 

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్య పథకానికి కంట్రిబ్యూషన్ డబ్బు బదిలీ చేయాలని కోరినట్టు తెలిపారు. ఈహెచ్ఎస్ లో ఇబ్బందులకు 104 టోల్ ఫ్రీలో ఆప్షన్ ఇస్తామన్నారని వెల్లడించారు. హామీ ఇచ్చిన మేరకు రూ.3 వేల కోట్లకు గాను రూ.2,600 కోట్లు ఇచ్చామని చెప్పారని వెంకట్రామిరెడ్డి వివరించారు. ఉద్యోగులు, ప్రభుత్వ వాటా రూ.1,554 కోట్లు వారంలో ఇస్తామన్నారని తెలిపారు. త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. పెండింగ్ డీఏలపై త్వరగా తేల్చాలని డిమాండ్ చేశామని చెప్పారు.

More Telugu News